వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేంద్ర తెలంగాణ ఇచ్చుడు సందేహమే: విజయశాంతి

|
Google Oneindia TeluguNews

పాపన్నపేట: కేంద్రం తెలంగాణ ఇస్తుందన్న నమ్మకం తనకు లేదని మెదక్‌ ఎంపీ విజయశాంతి స్పష్టంచేశారు. శనివారం రాత్రి పాపన్నపేటలో జరిగిన తెలంగాణ ధూంధాం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆమె మాట్లాడుతూ ఏకాభిప్రాయం పేరిట, శాంతి నెలకొల్పాలని అంటూ కేంద్రం మనకు మనశ్శాంతి లేకుండా చేస్తోందని దుయ్యబట్టారు. డిసెంబర్‌ 9న మొదటి ప్రకటన చేసిన కేంద్రం మోసం చేస్తోందని మండిపడ్డారు. తెలంగాణ ప్రక్రియంటూ ఉద్యమాన్ని సాగదీస్తూనే ఉన్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. 28తేదీ వరకు డెడ్‌లైన్‌ పెట్టామని, ఆ తరువాత సింహాలై గర్జిస్తామని హెచ్చరించారు.

తనకు కేంద్రంపై నమ్మకం లేకపోయినప్పటికీ విద్యార్థులపై ఉందన్నారు. 28వ తేదీ తరువాత తెలంగాణ రాకుంటే ప్రజాప్రతినిధులంతా తమ పదవులకు రాజీనామాలు చేసి స్పీకర్‌కు సమర్పించాలని డిమాండ్‌ చేశారు. చేయని వారిని అడగడుగునా యువకులు నిలదీయాలని పిలుపునిచ్చారు. తన రాజీనామాను స్పీకర్‌కు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తూ తనకు పదవి గడ్డిపోచతో సమానమన్నారు. స్వాతంత్య్రం వచ్చి 60 యేళ్లు దాటినా తెలంగాణ ప్రజలవి ఇంకా బాంఛన్‌ బతుకులుగానే ఉన్నాయన్నారు. సమైక్యవాదుల దోపిడీతో గుండెలు రగిలిపోతున్నాయని వాపోయారు.

మన రాష్ట్రంలో మనం ద్వితీయ శ్రేణి పౌరులుగా మారిపోయా మని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు శక్తి స్వరూపిణులుగా మారి ఉద్యమంలో మంటలు రగిలించాలని పిలుపునిచ్చారు. జనాల కోరిక మేరకు విజయశాంతి తాను నటించిన మొండి మొగుడు-పెంకిపెళ్లాం చిత్రంలోని 'లాలు దర్వాజ' పాట పాడారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, జెడ్పీ చైర్మన్‌ బాలయ్య మాజీ ఎమ్మెల్యేలు శశిధర్‌రెడ్డి, పద్మాదేవేందర్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ బట్టి జగపతి, జెడ్పీటీసీ సభ్యుడు మల్లప్ప, ఎంపీపీ వినోదారాణి, జేఏసీ చైర్మన్‌ దేవయ్య, రసమయి బాలకిషన్‌ పాల్గొన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X