తెలంగాణ జెఎసితో కాంగ్రెసు తెగదెంపులు
తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలను చేస్తున్న తమ పార్టీ విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ పై పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామని కాంగ్రెసు తెలంగాణ పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్ చెప్పారు. లగడపాటి రెచ్చగొట్టే ప్రకటనలు మానాలని తెలంగాణకు చెందిన రాష్ట్ర మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ విద్యార్థులు రేపటి చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని విరమించుకోవాలని ఆయన కోరారు. కోమటి రెడ్డి వెంకటరెడ్డితో పాటు డికె అరుణ, జె. గీతారెడ్డి వంటి మంత్రులు కూడా విద్యార్థులకు విజ్ఞప్తి చేశారు. తామే తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిస్తామని, విద్యార్థులు తమకు సహకరించాలని వారన్నారు.
తెలంగాణకు చెందిన మంత్రులు, కాంగ్రెసు శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు సమావేశమై తమ కార్యాచరణను ఖరారు చేసుకోవడానికి శుక్రవారం సమావేశమైన అనంతరం ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి శ్రీనివాస్ తో సమావేశమయ్యారు. ఆ తర్వాత వారు మీడియా ప్రతినిధుల సమావేశం ఏర్పాటు చేసి జెఎసితో తెగదెంపులు చేసుకుంటున్నట్లు వారు ప్రకటించారు.