రోశయ్య బడ్జెట్ పై ప్రతిపక్షాల విమర్శలు
గొప్పలకు పోయి ప్రతి ఏడాదీ రోశయ్య తన బడ్జెట్ ను పెంచుతున్నారని బిజెపి శాసనసభ్యుడు జి. కిషన్ రెడ్డి విమర్శించారు. అంకెల గారడీ చేసేందుకు రోశయ్య తన అనుభవాన్ని రంగరించి ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన అన్నారు. బడ్జెట్ లో ప్రాంతీయ సమానత్వం కనిపించలేదని ఆయన విమర్శించారు. అవసరాలకు, అంచనాలకు మధ్య వ్యత్యాసం ఉందని ఆయన అన్నారు. బడ్జెట్ లో జలయజ్ఞానికి కేటాయించిన నిధులను చూస్తే 20 ఏళ్లయినా రాష్ట్రంలోని సాగు నీటి ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి కాదని అర్థమవుతోందని వామపక్షాలు వ్యాఖ్యానించాయి. రోశయ్య బడ్జెట్ ను తప్పుల తడకగా వామపక్షాల నాయకులు అభివర్ణించారు.
రోశయ్య బడ్జెట్ స్థూలంగా బాగుందని, అయితే శాఖాపరంగా ఆశించిన స్థాయిలో కేటాయింపులు లేవని లోకసత్తా అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ అన్నారు. ఉపాధి కల్పన, విద్య, వైద్య, ఆరోగ్య శాఖలకు తగిన కేటాయింపులు లేవని ఆయన అన్నారు. శాసనసభ్యులకు నియోజకవర్గాల అభివృద్ధికి కోటి రూపాయలేసి కేటాయించడానికి తాను వ్యతికేరమని ఆయన చెప్పారు. శాంతిభద్రతలకు ప్రాధాన్యం ఉండాలని ఆయన అన్నారు.