శాంటియాగో: చిలీని కుదిపేసిన పెను భూకంపం లో ఇప్పటిదాకా 147 మంది మరణించినట్లు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఇక ఆస్తి ఏ మేరకు నష్ట పోయిందనేది లెక్క తేలలేదు. భారత కాలమానం ప్రకారం శుక్రవారం అర్ధరాత్రి దాటాక... 12.04 గంటలకు భూకంపం సంభవించింది. 8.8 తీవ్రతతో సుమారు 90 క్షణాలపాటు భూమి కంపించింది. ఆ తర్వాత రెండున్నర గంటల్లో 5 నుంచి 6.9 తీవ్రతతో 11 ప్రకంపనలు వచ్చాయి. చిలీ రాజధాని శాంటియాగోకు 325 కిలోమీటర్ల దూరంలో.. 35 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. ఈ భూకంప ఫలితంగా పసిఫిక్ సముద్రంలోనూ అలజడి రేగింది. దాంతో సునామీ వస్తుందేమోనని భయం ఏర్పడింది. చిలీ అధ్యక్షురాలు మిషెలీ బాచెలెట్, ఇతర అధికారులతో కలిసి అప్పటికప్పుడు సహాయ చర్యలపై దృష్టి సారించారు. "అది చాలా పెద్ద భూకంపం. ప్రజలు భయాందోళనలకు గురికావొద్దు. అన్ని సహాయ చర్యలు తీసుకుంటున్నాం'' అని భరోసా ఇచ్చారు.