తెలంగాణకై మందు బంద్: చరిత్రలో లాషాపురం
మలివిడత తెలంగాణ అమరవీరులకు ముందుగా సంతాపం ప్రకటించి జై తెలంగాణ నినాదాలతో హోరెత్తించారు. తెలంగాణలో మద్యం నిషేధించి ప్రభుత్వానికి వచ్చే రూ. 3 వేల కోట్ల ఆదాయం రాకుండా సహాయ నిరాకరణ ఉద్యమం చేపట్టాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రం ప్రకటించే వరకు మద్యం ఎవరూ ముట్టకూడదని గ్రామస్తుంతా ప్రతిజ్ఞ చేశారు. రాష్ట్రం సాధించేవరకు కన్నబిడ్డల సాక్షిగా..మద్యం ముట్టబోమని పురుషులు పత్రాలపై సంతకాలు చేశారు. తెలంగాణ సాధనకోసం మద్యం బహిష్కరిస్తామంటూ గ్రామంలో ర్యాలీ నిర్వహించి గొంతెత్తి నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ నర్సింహరాజ్ మాట్లాడుతూ ఐదు దశాబ్దాలుగా తెలంగాణ కోసం పోరాడుతున్నా పాలకవర్గాలు ఉద్యమాన్ని నీరుగారుస్తున్నారని విమర్శించారు. విద్యార్థులు అమూల్యమైన విద్యా సంవత్సరం కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రసాధన కోసం ప్రాణ, ఆస్తినష్టం, చట్టవ్యతిరేక కార్యక్రమాలు తలపెట్టకుండా ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా మద్యాన్ని బహిష్కరించాలని పిలుపునిచ్చారు. దీన్ని అన్నిగ్రామాల రాజకీయపార్టీల, విద్యార్థి జేఏసీలు ఆచరణలో పెట్టాలని కోరారు.