మంత్రి బొత్స 'ప్రత్యేక' వార్తలపై విద్యార్ధుల ఆగ్రహం
ఈ సమయంలో సభా ప్రాంగణంలోకి దూసుకువచ్చిన విద్యార్థులు సమైక్యాంధ్ర వర్ధిల్లాలి, సమైక్యాంధ్ర జిందాబాద్ అంటూ నినదించారు. ఆందోళన చేస్తున్న ఏడుగురు జేఏసీ విద్యార్థులపై మునగపాక ఎస్సై జి.శ్రీనివాస్ స్వల్పంగా లాఠీ ఛార్జి జరిపి అదుపులోకి తీసుకొన్నారు. అనంతరం వారిని అనకాపల్లి పట్టణ పోలీసు స్టేషన్కి తీసుకువచ్చారు. కాగా ఇక్కడ కూడా విద్యార్థులు పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి బొత్సాకు వ్యతిరేకంగా నిరసన నినాదాలు చేశారు. అనంతరం వారిని పూచీకత్తుపై విడుదల చేశారు.
ఈ సమావేశాన్ని అడ్డుకొనేందుకు సమైక్యాంధ్ర జేఏసీ విద్యార్థులు విశాఖపట్నం నుంచి వస్తున్నారని సమాచారం అందడంతో అనకాపల్లి బైపాస్రోడ్డు, నూకాంబికా ఆర్చ్ వద్ద పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. అయినప్పటికీ విద్యార్థులు పోలీసులకు చిక్కకుండా మంత్రి సభలో హఠాత్తుగా ప్రత్యక్షమై ప్రసంగాన్ని అడ్డుకున్నారు. ఈ పరిణామానికి పోలీసులు కంగుతిన్నారు. మంత్రి విద్యార్థులను వారించే ప్రయత్నం చేశారు. ఇంతలో పోలీసులు వారిని లాక్కుపోయారు.