హైదరాబాద్: విద్యుత్ కోతకు నిరసనగా తెలుగుదేశం, వామపక్షాల శాసనసభ్యులు మంగళవారం వినూత్న నిరసన ప్రదర్శన చేపట్టారు. శాసనసభ ఎదురుగా ఉన్న గన్ పార్కులో లాంతర్లతో ప్రదర్శన నిర్వహించారు. రైతులకు సకాలంలో విద్యుత్ సరఫరా చేసే వరకు తమ నిరసన కొనసాగుతుందని తెలుగుదేశం శాసనసభ్యుడు ఎర్రబెల్లి దయాకర రావు మీడియా ప్రతినిధులతో అన్నారు. ఆ తర్వాత డమ్మీ ట్రాన్స్ ఫార్మర్లతో శాసనసభ వరకు పాదయాత్ర నిర్వహించారు. విద్యుత్ సరఫరా విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తన మాటను నిలబెట్టుకోలేకపోయిందని తెలుగుదేశం, వామపక్షాల శాసనసభ్యులు విమర్శించారు.
కాగా, అస్తవ్యస్తమైన విద్యుత్ సరఫరాపై, అప్రకటిత కోతపై ప్రతిపక్షాలు మూకుమ్మడిగా శాసనసభలో వాయిదా తీర్మానం ప్రతిపాదించాయి. తెలుగుదేశం, ప్రజారాజ్యం, వామపక్షాలు, బిజెపి ఈ వాయిదా తీర్మానం ప్రతిపాదించాయి.