రాత్రి విందుతో రోశయ్య, జగన్ భేటీ
వైయస్ జగన్ తో పాటు దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి సన్నిహిత మిత్రుడు కెవిపి రామచందర్ రావు కూడా ముఖ్యమంత్రి విందుకు హాజరయ్యే అవకాశాలున్నాయి. రోశయ్యకు, జగన్ కు మధ్య సయోధ్య కోసం పార్లమెంటు సభ్యుడు సబ్బం హరి తీవ్ర ప్రయత్నాలు చేశారు. అందులో భాగంగానే ఈ భేటీ ఖరారైనట్లు సమాచారం. తామంతా కలిసే ఉన్నామని పార్టీ కార్యకర్తలకు సందేశం పంపే ఉద్దేశంతో ఈ భేటీ జరుగుతోందని చెబుతున్నారు.
అయితే, ఈ నెల 9వ తేదీ నుంచి వైయస్ జగన్ ఓదార్పు యాత్ర చేపడుతున్నారు. ఈ ఓదార్పు యాత్రలో మంత్రులు, అధికార పార్టీ శాసనసభ్యుల సహకారం జగన్ కు ఉండాలనే ఉద్దేశంతో కూడా సయోధ్య సమావేశం ఏర్పాటైనట్లు తెలుస్తోంది. పిసిసి సమన్వయ కమిటీ సమావేశం రేపు (బుధవారం) జరుగుతోంది. ఈ సమావేశంలో మంత్రివర్గ విస్తరణపై ఒక ఫార్ములా రూపొందే అవకాశం ఉంది. ఈ స్థితిలో తన వర్గానికి మంత్రివర్గ విస్తరణలో అన్యాయం జరగకుండా చూసుకునేందుకు కూడా జగన్ రాజీకి దిగుతున్నట్లు సమాచారం.