హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సిఎం రోశయ్యను దించడమే వైయస్ జగన్ లక్ష్యమా?

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్: కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ వ్యూహం అంతు చిక్కడం లేదు. ముఖ్యమంత్రి పీఠంపై ఆయన రోశయ్యను చూడలేకపోతున్నారనేది మాత్రం తెలిసిపోతూనే ఉంది. రోశయ్యనే కాదు, తన తండ్రి కూర్చున్న ముఖ్యమంత్రి పీఠంపై మరెవరూ కూర్చున్నా కూడా ఆయన ఇలాగే వ్యవహరించి ఉండేవారనేది కూడా అర్థమవుతూనే ఉన్నది. ముఖ్యమంత్రి సీటును ఆయన తన వారసత్వ సంపదగా ఆయన భావిస్తున్నట్లున్నారు. అందుకే జగన్ లో వ్యవహార శైలిలో తీవ్రమైన అసహనం వ్యక్తమవుతోంది. అయితే, జగన్ పార్టీని చీల్చడానికి సిద్ధపడుతారనే ప్రచారం జరుగుతోంది. కాంగ్రెసు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినప్పటికీ బలం తక్కువగానే ఉంది. కొద్ది మంది శాసనసభ్యులు తోక జాడించినా ప్రభుత్వం కూలిపోవచ్చు. అలా రోశయ్య ప్రభుత్వాన్ని పడగొట్టడానికే జగన్ తొలి రోజుల్లో కాంగ్రెసు లెజిస్టేచర్ పార్టీ (సిఎల్పీ) సమావేశం నిర్వహించాలని తన వర్గీయుల చేతి ఒత్తి చేయిస్తూ వచ్చారు. ఆ ఒత్తిడి నుంచి కాంగ్రెసు అధిష్టానం చాలా తెలివిగా బయట పడింది.

ఆ తర్వాత జగన్ కాస్తా వెనక్కి తగ్గినట్లే కనిపించారు. కానీ, ఏమైందో తెలియదు గానీ ఆయన ఇప్పుడు వీరావేశంతో ముందుకు దూకుతున్నారు. అధిష్టానం అండదండలు తనకు ఉంటాయని భావిస్తూ రోశయ్యపై ప్రత్యక్ష పోరుకు దిగారు. బహుశా ఆయన తన వర్గానికి చెందిన శాసనసభ్యుల చేత రాజీనామా చేయించి రోశయ్య ప్రభుత్వాన్ని కూలదోయడానికి పూనుకోవచ్చుననే ఊహాగానాలు చెలరేగుతున్నాయి. అందుకు తెలుగుదేశం పార్టీ కూడా సహకరించవచ్చు. ఎందుకంటే, అధికారంలోకి రావడానికి జగన్ ఎంతగా ఉవ్విళ్లూరుతున్నారో, మధ్యంతర ఎన్నికలను అనివార్యం చేసి అధికారాన్ని అంది పుచ్చుకోవాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అంతగా ఆరాటపడుతున్నారు. రాష్ట్ర కాంగ్రెసులో, ప్రభుత్వంలో వైయస్ జగన్ ప్రాబల్యాన్ని తగ్గించడానికి పార్టీ అధిష్టానం సమయం తీసుకుంటూ జాగ్రత్తగా వ్యవహరించింది.

జగన్ వర్గానికి చెందిన ముగ్గురు శాసనసభ్యులు గుర్నానాథ్ రెడ్డి, ఆదినారాయణ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి వంటివారు మాత్రమే జగన్ కు మద్దతుగా నిలిచే అవకాశం ఉంది. జగన్ మాటకు కట్టుబడి శాసనసభ్యత్వాలకు రాజీనామా చేసేవారి సంఖ్య రెండంకెలకు మించే పరిస్థితి లేదని అంటున్నారు. దాంతో జగన్ పై కత్తి నూరడానికే కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ నిర్ణయించుకున్నారు. ఒకవేళ జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యులు రాజీనామా చేస్తే ప్రభుత్వం పడిపోకుండా ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి మద్దతును కాంగ్రెసు పొందినట్లు తెలుస్తోంది. ఈ మేరకు చిరంజీవితో సోనియా ఒక అవగాహనకు వచ్చినట్లు చెబుతున్నారు. ప్రస్తుత స్థితిలో శోభా నాగిరెడ్డి వంటి ఒకరిద్దరు ప్రజారాజ్యం శాసనసభ్యులు తప్ప మిగతా వారంతా చిరంజీవి మాటకు కట్టుబడే అవకాశాలున్నాయి. జగన్ వర్గీయులు రాజీనామాలు చేసి సంక్షోభం సృష్టించే దశలో ఆ మేరకు ప్రజారాజ్యం అండదండలతో కాంగ్రెసు గట్టెక్కే పరిస్థితి ఉంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X