సిఎం రోశయ్యను దించడమే వైయస్ జగన్ లక్ష్యమా?
ఆ తర్వాత జగన్ కాస్తా వెనక్కి తగ్గినట్లే కనిపించారు. కానీ, ఏమైందో తెలియదు గానీ ఆయన ఇప్పుడు వీరావేశంతో ముందుకు దూకుతున్నారు. అధిష్టానం అండదండలు తనకు ఉంటాయని భావిస్తూ రోశయ్యపై ప్రత్యక్ష పోరుకు దిగారు. బహుశా ఆయన తన వర్గానికి చెందిన శాసనసభ్యుల చేత రాజీనామా చేయించి రోశయ్య ప్రభుత్వాన్ని కూలదోయడానికి పూనుకోవచ్చుననే ఊహాగానాలు చెలరేగుతున్నాయి. అందుకు తెలుగుదేశం పార్టీ కూడా సహకరించవచ్చు. ఎందుకంటే, అధికారంలోకి రావడానికి జగన్ ఎంతగా ఉవ్విళ్లూరుతున్నారో, మధ్యంతర ఎన్నికలను అనివార్యం చేసి అధికారాన్ని అంది పుచ్చుకోవాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అంతగా ఆరాటపడుతున్నారు. రాష్ట్ర కాంగ్రెసులో, ప్రభుత్వంలో వైయస్ జగన్ ప్రాబల్యాన్ని తగ్గించడానికి పార్టీ అధిష్టానం సమయం తీసుకుంటూ జాగ్రత్తగా వ్యవహరించింది.
జగన్ వర్గానికి చెందిన ముగ్గురు శాసనసభ్యులు గుర్నానాథ్ రెడ్డి, ఆదినారాయణ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి వంటివారు మాత్రమే జగన్ కు మద్దతుగా నిలిచే అవకాశం ఉంది. జగన్ మాటకు కట్టుబడి శాసనసభ్యత్వాలకు రాజీనామా చేసేవారి సంఖ్య రెండంకెలకు మించే పరిస్థితి లేదని అంటున్నారు. దాంతో జగన్ పై కత్తి నూరడానికే కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ నిర్ణయించుకున్నారు. ఒకవేళ జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యులు రాజీనామా చేస్తే ప్రభుత్వం పడిపోకుండా ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి మద్దతును కాంగ్రెసు పొందినట్లు తెలుస్తోంది. ఈ మేరకు చిరంజీవితో సోనియా ఒక అవగాహనకు వచ్చినట్లు చెబుతున్నారు. ప్రస్తుత స్థితిలో శోభా నాగిరెడ్డి వంటి ఒకరిద్దరు ప్రజారాజ్యం శాసనసభ్యులు తప్ప మిగతా వారంతా చిరంజీవి మాటకు కట్టుబడే అవకాశాలున్నాయి. జగన్ వర్గీయులు రాజీనామాలు చేసి సంక్షోభం సృష్టించే దశలో ఆ మేరకు ప్రజారాజ్యం అండదండలతో కాంగ్రెసు గట్టెక్కే పరిస్థితి ఉంది.