జగన్ కు చుక్కెదురు: ఓదార్పుకు అనుమతి లేదన్న మొయిలీ
నిజానికి తెలంగాణ ఓదార్పు యాత్ర వద్దని తాను ముందే సూచించానని, అయినా జగన్ వినకుండా యాత్రకు వెళ్లడం వల్ల లేనిపోని సమస్యలు తలెత్తాయని మొయిలీ చెప్పారు. తెలంగాణలో పర్యటించడానికి జగన్ అనుమతి కోరారని, ఉప ఎన్నికలు పూర్తయ్యే వరకు ఆగాలని చెప్పానని, మిగతా ప్రాంతాల్లో పర్యటనపై తనకు జగన్ చెప్పలేదని, అందువల్ల అనుమతి ఇచ్చే ప్రశ్నే ఉత్పన్నం కాదని ఆయన అన్నారు. జగన్ రాష్ట్రంలో ఎక్కడా పర్యటించకపోవడమే మంచిదని ఆయన అన్నారు. జగన్ పోయినప్పుడు ఆయన చుట్టూ అనుయాయులు వస్తారని, ఒంటరిగా వెళ్లడం, లేదంటే కొంతమందిని వెంటబెట్టుకు వెళ్లడం కూడా సరైంది కాదని ఆయన అన్నారు. యాత్రల్లో అతన్ని చాలా మంది అనుసరిస్తున్నారని, దీనివల్ల సమస్యలు తలెత్తుతున్నాయని, ఇప్పటికే కొన్ని సమస్యలు సృష్టించారని, దాన్ని మేం కోరుకోవడంలేదని ఆయన స్పష్టం చేశారు.
జగన్ ఓదార్పు యాత్ర వ్యక్తిగతమా? కాదా? అన్నది ఇక్కడ ముఖ్యంకాదని, తమకూ సెంటిమెంట్లు ఉన్నాయని, ఇక్కడ ప్రశ్న అది కాదని, ఒకసారి బయలుదేరితే ఊరేగింపులు, మీటింగ్ లు ఉంటాయని, చాలా సంఘటనలు జరుగుతాయని, ప్రస్తుత పరిస్థితుల్లో తాము ఇలాంటివేమీ కోరుకోవడం లేదని, ప్రస్తుతానికి ఉభయ ప్రాంతాల్లో శాంతి నెలకొనాలన్నదే తమ ప్రధాన ఉద్దేశమని ఆయన అన్నారు.