రాష్ట్రంలో భారత బంద్ షురూ: నిలిచిపోయిన బస్సులు
భారత్ బంద్ కారణంగా రాష్ట్రవ్యాప్తంగా పలు డిపోల్లో బస్సులు నిలిచిపోతున్నాయి. హైదరాబాద్ లోని రాజేంద్రనగర్ డిపో ఎదుట బైఠాయించి భాజపా కార్యకర్తలు బస్సులను అడ్డుకుంటున్నారు. నల్గొండ జిల్లాలో 7 డిపోల్లో బస్సులు నిలిచిపోయాయి. నల్గొండ, సూర్యాపేట, మిర్యాలగూడ బస్టాండ్ల వద్ద ఆందోళనలు జరుగుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలోనూ పలు ప్రాంతాల్లో బస్సు సర్వీసులను ఆందోళనకారులు అడ్డుకున్నారు. సీపీఎం నాయకులు ఖమ్మం జిల్లాలోని డిపోల ఎదుట బైఠాయించి బస్సులను అడ్డుకుంటున్నారు. కడపలోనూ బంద్ కారణంగా మైదుకూరు డిపోలోనే బస్సులు నిలిచిపోయాయి. ఒంగోలులో హర్తాళ్ నిర్వహిస్తున్న తెదేపా మాజీ ఎమ్మెల్యే ఈదర హరిబాబు సహా పలువురిని పోలీసులు అరెస్టు చేశారు. బంద్ సందర్భంగా నెల్లూరు జిల్లాలోని రావూరు, ఆత్మకూరు, కావలిలో ఆర్టీసీ బస్సులు కదలడంలేదు. గుంటూరులోనూ ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద బస్సులను అడ్డుకొని తెలుగుదేశం, వామపక్షాలు ఆందోళన నిర్వహిస్తున్నాయి.
ధరల పెరుగుదలకు నిరసనగా చేపడుతున్న భారత్ బంద్ నుంచి తిరుమల వెళ్లే బస్సులకు మినహాయింపునిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ డిపోల ఎదుట విపక్షాలు ఆందోళనలు, రాస్తారోకోలు చేస్తుండడంతో పలు ప్రాంతాలకు బస్సు సర్వీసులు నిలిచిపోయాయి. నగర శివారులోని హయత్నగర్, ఇబ్రహీంపట్నం, ఉప్పల్కు బస్సులను ఆర్టీసీ రద్దు చేసింది. తిరుపతి నుంచి కర్నూలు వెళ్లాల్సిన బస్సులను కడపలో అధికారులు నిలిపివేశారు. దీంతో ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు. విజయవాడ, మహబూబ్నగర్ సహా పలు ప్రాంతాల నుంచి హైదరాబాద్కు బస్సుల రాకపోకలు నిలిచిపోయాయి. విశాఖ నుంచి ఇతర ప్రాంతాలకు బస్సు సర్వీసులను నిలిపివేశారు. అయితే నగరంలో పాక్షికంగా సిటీ బస్సులను ఆర్టీసీ నడుపుతోంది. హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు బస్సు సర్వీసులు యథాతథంగా నడుస్తాయని ఆర్టీసీ ప్రకటించింది.