ప్రత్యక్ష యుద్ధామే: వైయస్ జగన్ వ్యతిరేకుల ప్రతిదాడి
ఇంతటి తీవ్ర వాతావరణంలోనూ రోశయ్య,జగన్ల మధ్య సయోధ్యకు కొందరు మంత్రులు ప్రయత్నాలు సాగించారు. ఇందుకోసం ఢిల్లీలో పెద్దలతో కూడా మాట్లాడాలని నిర్ణయించారు. రఘువీరారెడ్డి, ధర్మాన ప్రసాదరావు ఈ ప్రయత్నాల్లో ఉన్నారు. వైయస్ జగన్ వ్యాఖ్యలను మోపిదేవి వెంకట రమణ, అహ్మదుల్లా, శిల్పా మోహన్రెడ్డి, బాలరాజు ఖండించారు. మంత్రులు తన యాత్రకు రాలేక, అక్కడ ఉండలేక నరకయాతన అనుభవిస్తున్నారని జగన్ చేసిన వ్యాఖ్యను వారు ఖండించారు. ఆదివారం సీనియర్ నేతలు, పార్టీ బాధ్యులు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఒక్కసారిగా జగన్పై విమర్శలకు దిగారు. జగన్ పార్టీని, ప్రభుత్వాన్ని అనవసరమైన వివాదాల్లోకి లాగి ప్రతిష్ఠను దిగజార్చేలా వ్యవరిస్తున్నారని మంత్రులు మండిపడగా, ఆయన కార్యకర్తల ముందు తమను దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఎమ్మెల్యేలు విమర్శించారు. ప్రభుత్వంపై, పార్టీ నాయకత్వంపై నిందలు మోపడం ద్వారా లబ్ధి పొందాలనే ప్రయత్నంలో జగన్ ఉన్నారని వ్యాఖ్యానించారు. జగన్ వెంట ఉంటారని భావించిన వైయస్ అనుచరులు కూడా జగన్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. ఇంత వరకు వైయస్ పై అభిమానంతో దూరంగా ఊంటూ కూడా జగన్ యాత్రకు సహకరించామని, అయితే జగన్ వ్యవహారం శ్రుతి మించడం వల్ల తాము దూరం కావాల్సి వస్తోందని అంటున్నారు.