సిఎం పేషీపై ధ్వజమెత్తిన సాక్షి డైలీ: విశాఖ భూముల గొడవ
సీఎం కార్యాలయం నుంచి ఫైలు వచ్చిందే తడవుగా విశాఖ జిల్లా రెవెన్యూ అధికారులు కూడా అత్యంత వేగంగా స్పందిస్తున్నట్లు సమాచారం. అసైన్డ్ భూమి డీఫామ్ పట్టాలను రద్దుచేస్తే, ఆ భూమి ప్రభుత్వ పరమవుతుందని, అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి నామమాత్రపు ధరకు భూమి తీసుకోవాలన్నది ఆ మాజీ ఎంపీ పథకంగా తెలుస్తోంది. అందుకు సీఎం కార్యాలయం నుంచి జిల్లా రెవెన్యూ అధికారుల వరకూ అందరూ సహకరిస్తున్నారని అర్థమవుతోంది. ఆ ప్రయత్నాలు ఎలా సాగుతున్నాయో వివరిస్తూ ఆ భూముల వివరాలను కూడా సాక్షి దినపత్రిక ఇచ్చింది.
సాక్షి దినపత్రిక కథనం ప్రకారం - వైఎస్ మరణానంతరం సదరు టీడీపీనేత తాజాగా భూముల స్వాధీనానికి ప్రయత్నాలు ప్రారంభించారు. అప్పట్లో ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న 7.25 ఎకరాల భూమితోపాటు, యూనివర్సిటీ పక్కనే ఉన్న 28.8 ఎకరాల అసైన్డ్ భూములను సైతం కైవసం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఈ భూముల డీ-ఫాం పట్టాలున్న పేద రైతులను సంప్రదించి ఆ భూములను కొనుగోలు చేసేందుకు అనుమతించాలంటూ ఏకంగా ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. ఈ 36 ఎకరాల భూమిలో దూర విద్యా కేంద్రంతోపాటు, వినూత్న కోర్సులు ప్రవేశపెట్టడానికి అవసరమైన భవనాల నిర్మాణాన్ని చేపట్టనున్నట్లు ఆయన ప్రభుత్వానికిచ్చిన వినతి పత్రంలో పేర్కొన్నారు. ఈ భూముల కోసం ఆ మాజీ ఎంపీ సీఎంకి దరఖాస్తు చేసుకున్నదే తడవుగా ముఖ్యమంత్రి కార్యాలయం ఏ విధంగా కదిలింది కూడా సాక్షి దినపత్రిక వివరించింది.