AP Heatwave: వడగాల్పుల ఎఫెక్ట్- సెలవులకు చంద్రబాబు ఆదేశాలు..!
ఏపీలో వడగాల్పుల తీవ్రత రోజురోజుకీ పెరిగిపోతోంది. ఇప్పటికే పలు జిల్లాల్లో ప్రభుత్వం హైఅలర్ట్ ప్రకటించింది. ప్రజల్ని ఇళ్ల నుంచి బయటికి కదలొద్దని రోజూ హెచ్చరికలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఇవాళ మరోసారి అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు (Chandrababu) కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇందులో ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో స్థానికంగా సెలవులు ప్రకటించాలని కూడా ఆదేశాలు ఇచ్చారు.
రాష్ట్రంలో వడగాల్పుల తీవ్రత నేపథ్యంలో సీఎం చంద్రబాబు ఇవాళ అత్యవసర సమీక్ష నిర్వహించారు. ఎండల తీవ్రత దృష్ట్యా అధికార యంత్రాంగం నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, ప్రజలను రక్షించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదవుతున్న ప్రాంతాలను గుర్తించి, ఆయా ప్రాంతాల్లోని ప్రజలకు నిరంతరం హెచ్చరికలు పంపాలని అధికారులకు సూచించారు. ఎండల తీవ్రత మరీ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పరిస్థితులను బట్టి స్థానికంగా సెలవులు ప్రకటించాలని ఆదేశించారు.

తీవ్రస్థాయి ఎల్ నినో కారణంగా హీట్ వేవ్ తీవ్రత కూడా గణనీయంగా పెరిగిందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. దీనిపై స్పందించిన సీఎం ప్రజలకు ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందేలా రద్దీగా ఉన్న ప్రాంతాలు, ప్రజలు ఎక్కువగా తిరిగే చోట్ల చల్లని మంచినీరు, మజ్జిగ, ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలని స్పష్టం చేశారు. వడగాలుల నుంచి ఎలా రక్షించు కోవాలో ప్రజలకు అవగాహన కల్పించేందుకు జిల్లా కలెక్టర్లు మీడియా సమావేశాలు నిర్వహించాలని సూచించారు. మీడియాతో పాటు సామాజిక మాధ్యమాల ద్వారా నిరంతరం సమాచారాన్ని చేరవేయాలని నిర్దేశించారు. ప్రజల ప్రాణాలే ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని, ఎండ తీవ్రత నేపథ్యంలో బయటకు వచ్చేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
అత్యవసర పరిస్ధితుల్ని ఎదుర్కోవడానికి కలెక్టర్లు, మండల స్థాయి అధికారులు పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉండాలన్నారు.














Click it and Unblock the Notifications