రక్త చరిత్రతో రాయలసీమలో మళ్లీ ఫాక్షనిజం పెరుగుతుందా?

రక్త చరిత్ర పాతగాయాలను తట్టి లేపుతుందని, దాని వల్ల అనంతపురం జిల్లాలో ఫాక్షనిజం మళ్లీ పెరుగుతుందని కొంత మంది వాదిస్తున్నారు. బిజెపి నాయకులు ఆ మాటే అంటున్నారు. మాజీ నక్సలైట్ కిష్టప్ప భార్య భూలక్ష్మి కూడా అదే మాట అంటున్నారు. అనంతపురం జిల్లాకు చెందిన సీనియర్ శాసనసభ్యుడు జెసి దివాకర్ రెడ్డి మాత్రం దాన్ని కొట్టిపారేస్తున్నారు. రేపు శుక్రవారం సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో అనంతపురం జిల్లాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రక్త చరిత్ర సినిమా పోస్టర్లు థియేటర్ల వద్ద తప్ప ఎక్కడా కనిపించడం లేదు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సినిమాను సినిమాగా చూడాలని జిల్లా ఎస్పీ ఎం కె సింగ్ ప్రజలకు విజ్ఝప్తి చేస్తున్నారు. ఎంకె సింగ్ స్వయంగా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.
మద్దెలచెర్వు సూరి, పరిటాల రవి వంటి వారిని మోడల్ గా మాత్రమే తీసుకున్నానని, ఇతివృత్తం మాత్రం కల్పితమని, వాస్తవం కాదని రామ్ గోపాల్ వర్మ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. సినిమా ప్రివ్యూకు ఆయన మద్దెలచెర్వు సూర్యనారాయణ కుటుంబాన్ని, తెలుగుదేశం శాసనసభ్యురాలు పరిటాల సునీత కుటుంబాన్ని ఆహ్వానించినట్లు సమాచారం. మద్దెలచెర్వు సూరితో కలిసి రామ్ గోపాల్ వర్మ అనంతపురంలో సినిమా చూడడానికి ప్రత్యేక హెలికాప్టర్లో వెళ్తున్నట్లు తొలుత వార్తలు వచ్చాయి. అయితే అనంతపురంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఏర్పడడంతో మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది. ఆయన మద్దెలచెర్వు సూరితో కలిసి బెంగళూర్ లో సినిమా చూడడానికి ఏర్పాట్లు చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.
రక్త చరిత్ర సినిమాపై మీడియా తీవ్రమైన ఉత్కంఠను, ఉద్విగ్నతను పెంచుతోంది. ఎప్పటికప్పుడు వివాదాలను వెలికి తీస్తూ పెద్ద యెత్తున టీవీ చానెళ్లు వార్తాకథనాలను ప్రసారం చేస్తున్నాయి. ప్రత్యేక చర్చా కార్యక్రమాలను పెడుతున్నాయి. రామ్ గోపాల వర్మతో ప్రత్యేక ఇంటర్వ్యూలు ఏర్పాటు చేశాయి. ఆయనతో చర్చాగోష్టులు నిర్వహించాయి.












Click it and Unblock the Notifications