మధ్యంతర ఎన్నికలే వైయస్ జగన్మోహన్ రెడ్డి చిచ్చుకు కారణమా?

ఇంతకుముందే జగన్ తన ఓదార్పుయాత్రలో కాంగ్రెసు కు పరోక్ష హెచ్చరికలు చేశారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని ఓదార్పుయాత్ర ముగింపు సభలో సహనాన్ని పరీక్షించవద్దని అధిష్టానాన్ని హెచ్చరించారు. కాంగ్రెసు పార్టీలో వైయస్ అభిమానులకు విలువ లేదన్నారు. అంతకుముందు అడపాదడపా విమర్శలు చేసిన జగన్ నెల్లూరులో మాత్రం ఘాటుగానే స్పందించారు. అప్పుడే జగన్ సొంతపార్టీకి సిద్ధమయ్యాడని రాజకీయ విశ్లేషకులు భావించారు. తాజా సోనియా వ్యతిరేక కథనాలతో వేరుకుంపటికి పునాది పడ్డట్టు కాంగ్రెసు వారు కూడా భావిస్తున్నారు. కాంగ్రెసులో ఇప్పుడప్పుడే తనకు ప్రాధాన్యం ఇచ్చే అవకాశం లేదని, ఎలాగు మధ్యంతరానికి సోనియా పచ్చజెండా ఊపిందనే సమాచారం జగన్ పార్టీలో చీలిక తేవడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. సొంత పార్టీ ప్రకటనకు మరెన్నో రోజులు లేదని కొందరు అభిప్రాయపడుతున్నారు.
తాను ఓదార్పు చేపట్టిన సమయంలోనే తన అనుచరులైన కొండా సురేఖ, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, అంబటి రాంబాబులపై అధిష్టానం చర్యలకు పూనుకున్న విషయాన్ని జగన్ పదేపదే ప్రస్తావించారు. జగన్ తనంత తానే వేరు కుంపటి పెట్టకుండా పార్టీయే తనను వెళ్లగొట్టేలా చర్యలకు పూనుకుంటున్నాడు. ఇప్పటికే వైయస్ మరణం సానుభూతికి పార్టీ వెళ్లగొడితే మరింత సానుభూతి కలిసి వస్తుందని భావిస్తున్నాడు. అందుకే ముఖ్యమంత్రి రోశయ్యపై, రాష్ట్రంలోని ప్రభుత్వంపై విమర్శల జడివాన కురిపించాడు. అయితే వీటిని అధిష్టానం చూసీచూడనట్టు వ్యవహరించింది. రోశయ్యపై, ప్రభుత్వంపై విమర్శలు చేసిన జగన్ వర్గం నేతలపై అధిష్టానం చర్యలు తీసుకున్నది. కానీ జగన్ మాత్రం ఏమీ అనలేదు. దీంతో జగన్ సోనియాపై దృష్టి సారించాడు. సోనియాను టార్గెట్ చేసుకుంటేనే తను బయటికి వెళ్లే అవకాశం వస్తుందని భావించే ఇలాంటి చర్యలకు పూనుకుని ఇలాంటి చర్యలకు పాల్పడ్డట్టు సమాచారం.












Click it and Unblock the Notifications