వైయస్ జగన్ బలమెంత, లక్ష్యదీక్షతో తేలిపోయిందా?
తొలి రోజు దీక్షకు 23 మంది శాసనసభ్యులు హాజరయ్యారు. వారిలో కాంగ్రెసు శాసనసభ్యులే అధికంగా ఉన్నారు. రెండో రోజు అదనంగా ఐదుగురు శాసనసభ్యులు దీక్షలో కనిపించారు. మొత్తం కలిపితే 27 మంది శాసనసభ్యుల బలం ఆయనకు ఉన్నట్లు స్పష్టమవుతోంది. అయితే, నిజంగానే శాసనసభలో బలనిరూపణ జరిగి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని పడగొట్టదలుచుకుంటే అంత మంది జగన్ కు మద్దతు పలుకుతారా అనేది కూడా సందేహమే. ఈ విషయాన్నే విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ మరో రూపంలో చెప్పారు. వైయస్ జగన్ దీక్షను రాజకీయంగా తీసుకోవడం లేదని, దీక్ష చేస్తున్నారు కాబట్టి పరామర్శించడానికి చాలా మంది వెళ్లారని ఆయన చెప్పారు. ఆ రోజు వైయస్ జగన్ జన్మదినం కూడా. ఆ సందర్భంగా ఆయనకు అభినందనలు తెలపడానికి కూడా వారు ఆ సందర్భాన్ని వినియోగించుకున్నారని అంటున్నారు.
ఏమైనా, రెండో రోజు దీక్ష అంత కలగా కనిపించలేదు. వైయస్ జగన్ తో మొదటి నుంచీ ఉన్నవారు అలాగే ఉన్నారు. అంబటి రాంబాబు, కొండా సురేఖ, భూమన కరుణాకర్ రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్, మేకపాటి రాజమోహన్ రెడ్డి వంటి నాయకులు ఆయన వెంట ఉన్నారు. కొణతాల రామకృష్ణ వంటి కొంత మంది మాజీ మంత్రులు, సామినేని ఉదయభాను వంటి మరికొంత మంది మాజీ శాసనసభ్యులు ఆయన వెంట వెళ్లారు. పరిస్థితి భవిష్యత్తులో కూడా ఇలాగే ఉంటుందని అంటున్నారు. ప్రస్తుతం పదవుల్లో ఉన్నవారు ఆయన వైపు వెళ్లే పరిస్థితి లేదని అంటున్నారు.