కె. చంద్రశేఖర రావు ఎవరంటూ డి. శ్రీనివాస్ రుసరుసలు
శ్రీకృష్ణ కమిటీ నివేదిక తెలంగాణపై ఇస్తున్న తీర్పుకాదనీ, సమస్యకు పరిష్కారం కూడా కాదని డీఎస్ గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అభిప్రాయపడ్డారు. కమిటీ నివేదికపై పత్రికల్లో వచ్చే వూహాగానాలు, పనికిరానివారు మాట్లాడే మాటలకు ప్రజలు స్పందించరాదన్నారు. అంటే, కేంద్ర నిర్ణయానికి కట్టుబడి ఉండాలంటారా? అన్న ప్రశ్నకు ఆయన బదులిస్తూ 'ప్రజలకందరికీ ఎలా చెప్పగలను. మా పార్టీ శ్రేణులకు మాత్రం చెప్పగలను' అని అన్నారు.
వివిధ అంశాలపై విలేఖరులు అడిగిన ప్రశ్నలకు డీఎస్ స్పందిస్తూ క్లాస్ తీసుకున్నారు. మీ పార్టీ ఎంపీలను కూడా తెలంగాణ కోసం కేసీఆర్ రాజీనామా చేయమంటున్నారు కదా? అన్న విలేకరుల ప్రశ్నకు..'మీరు చేయండి రాజీనామా, మీ మీడియా మూతపడిపోతుందని అనుకుంటున్నారేమో' అంటూ డీఎస్ తీవ్రంగా స్పందించారు. తెలంగాణలోనే ఎక్కువ బలగాలను దించడం, కవాతు నిర్వహించడం ప్రజలను రెచ్చగొట్టడం కాదా అన్న ప్రశ్నకు స్పందిస్తూ..'మీరు మెప్పించే ప్రయత్నం చేయండి..రెచ్చగొట్టే కార్యక్రమాలను మీరు, మేమూ చేయకుంటే చాలు. ఒక ప్రాంతంలోనే ఎక్కువ బలగాలను దించారనుకోవడం ఊహాజనితం. శాంతిభద్రతల కోసమే ఈ చర్య. బలగాలు వస్తుంటయ్..పోతుంటయ్ వాటిపని అదేకదా? మీరు సహకరిస్తే చాలు' అని డీఎస్ వ్యాఖ్యానించారు.