వైయస్ జగన్ తో కె. చంద్రశేఖర రావు చేతులు కలుపుతారా?

ఉమ్మడి శత్రువైన కాంగ్రెసును పడగొట్టడానికి చేతులు కలపడానికి ఒక మేరకు కెసిఆర్, జగన్ అంగీకారానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పుడు రాష్ట్రం విడిపోతే రెండు చోట్ల కూడా కాంగ్రెసు అధికారంలోకి వస్తుందని, రాజకీయంగా తమకు ప్రయోజనం ఉండదని, రాజకీయ ప్రయోజనం పొందాలంటే ప్రభుత్వాన్ని పడగొట్టి ఎన్నికలను ఆహ్వానించడమే మార్గమని కెసిఆర్ భావిస్తున్నారట. ఇదే విషయాన్ని వైయస్ జగన్ తో చెప్పినట్లు సమాచారం. ప్రస్తుతం వైయస్ పై ప్రజల్లో ఉన్న అభిమానం వల్ల, వైయస్ జగన్ కు లభిస్తున్న ఆదరణ వల్ల సీమాంధ్రలో వైయస్ జగన్ అధిక సీట్లు సాధించుకుంటారని తెరాస నాయకుడొకరు వైయస్ జగన్ వర్గానికి నచ్చజెబుతున్నట్లు సమాచారం. తెలంగాణలో వైయస్ జగన్ అడుగు పెట్టలేరని, తాము సీమాంధ్రలోకి రాలేమని, అందువల్ల కలిసి పనిచేస్తే ఇరువురికి లాభం కలుగుతుందని వివరిస్తున్నట్లు తెలుస్తోంది.
మధ్యంతర ఎన్నికల తర్వాత రాష్ట్రం విడిపోతే సీమాంధ్రలో వైయస్ జగన్, ఇక్కడ తాము ఉంటామనేది కెసిఆర్ అనుచరులు అంటున్న మాటగా తెలుస్తోంది. అయితే, విడివిడిగా వ్యవహరిస్తూనే కలిసి పనిచేయాలనేది కెసిఆర్ అంతరంగమని చెబుతున్నారు. సమైక్యవాది అయిన వైయస్ జగన్ తో కలిసిపోయామనే అపవాదు రాకుండా ఈ పనిని పూర్తి చేయాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. కెసిఆర్ ప్రతిపాదనలు ఒక మేరకు వైయస్ జగన్ కు కూడా నచ్చినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications