కడప రియల్టర్స్తో భాను కిరణ్ లింక్స్: హైదరాబాదులో సెటిల్మెంట్లు
పది పన్నెండేళ్లుగా దందా కొనసాగిస్తున్న వారిద్దరు పులివెందుల, పొద్దుటూరుకు చెందినవారుగా పోలీసులు గుర్తించారు. సూరి, భానుకు వీరితో ఆరేళ్ల కిందట పరిచయం ఏర్పడింది. భాను కిరణ్ ఆ ఇద్దరు రియల్టర్లతో కలిసి 2006 నుంచి 2008 వరకు పదుల సంఖ్యలో సెటిల్మెంట్లు చేశాడు. ఇందులో కొన్ని సూరికి తెలియకుండానే చేసేవాడని అంటున్నారు. సూరి పేరుతో స్థల యజమానులను బెదిరించడం భాను వంతైతే, తర్వాత రియల్టర్లు ఆ స్థలాలను తక్కువ ధరకే చేకిజ్కించుకునే వారు. వాటిని ప్లాట్లుగా విభజించి రూ.లక్షల్లో అమ్ముకునే వారు. వీటిలో కొన్నింటిని బినామీ పేర్లతో సొంతానికి అట్టిపెట్టుకున్నట్టు తెలుస్తోంది.
గచ్చిబౌలిలోని డీఎల్ఎఫ్ కార్యాలయం సమీపంలో ఐదు ఎకరాలు, మదీనగూడలో తొమ్మిది ఎకరాల ఏడు కుంటలు, మసీదబండలోని ఓ ప్రముఖ కార్ల షోరూం ఎదురుగా ఉన్న అపార్ట్మెంటులో ఫ్లాటులు భానుకిరణ్ బినామీ ఆస్తులుగా పోలీసులు గుర్తించారు. ఈ ఆస్తులు 2007-08లో రిజిస్టర్ అయినట్లు పోలీసుల విచారణలో తెలిసిందని చెబుతున్నారు. సెటిల్మెంట్ల ద్వారా భాను రూ.లక్షలాది నగదును సంపాదించేవాడని పోలీసులు గుర్తించారు.
ఓ బహుళ జాతి సంస్థ బ్యాంకులో రూ.40 లక్షలు, మరో స్థానిక బ్యాంకులో రూ.30 లక్షల లావాదేవీలు జరిగాయి. ఈరెండు ఖాతాల్లో ప్రస్తుతం రూ.2.5 లక్షల నగదు ఉన్నట్టు తేలింది. భాను మరో బినామీ ఖాతా కూడా తెరిచినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. అసలు ఖాతా నుంచి బినామీ ఖాతాలోకి లక్షల్లో నగదును బదిలీ చేసుకున్నాడు. సూరి హత్యకు వారంరోజుల ముందు ఆ ఖాతాలో సొమ్మును డ్రాచేసి కొద్దిపాటి నగదు వదిలిపెట్టినట్లు దర్యాప్తులో తెలిసింది.