మద్దెలచెర్వు సూరి హత్య కేసు: భాను కిరణ్ ఎపిసోడ్లో ఛోటా రెడ్డి
అయితే, పోతుల సురేశ్ వర్గంతో చోటారెడ్డి ఇప్పటికీ సంబంధాలు కొనసాగిస్తున్నాడా? లేదా? అనే విషయం నిర్ధారించుకోడానికి ప్రయత్నిస్తున్నారు. సూరి హత్య జరిగిన రోజున భాను కాల్ లిస్ట్లో హోంమంత్రి కుమారుడికి స్నేహితుడైన ప్రదీప్రెడ్డితోపాటు సుబ్బయ్య, గణేశ్ కుమార్ల ఫోన్ నెంబర్లు కూడా ఉన్నాయి. అయితే, గణేశ్ కుమార్ పేరిట ఉన్న సిమ్ కార్డును భాను తన అంగరక్షకుడైన మన్మోహన్సింగ్కు ఇచ్చి ఉండవచ్చని పోలీసు అధికారులు భావిస్తున్నారు.
సూరి హత్య తరువాత పోలీసులు మాదాపూర్లోని అలేఖ్య అపార్ట్మెంట్లోని ఫ్లాట్ నుంచి ఓ ల్యాప్టాప్ను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఇది భానుదని తొలుత భావించారు. ల్యాప్టాప్లోని సమాచారాన్ని విశ్లేషిస్తే కీలకమైన వివరాలు వెలుగు చూస్తాయని, భాను ఆస్తుల చిట్టా కూడా బయటపడుతుందని ఆశించారు.
ఈ ల్యాప్టాప్ను ఫోరెన్సిక్ సైన్స్ ప్రయోగశాలకు పంపించారు. చివరికి... ఈ ల్యాప్టాప్ భానుది కాదని... సూరిదేనని స్పష్టమైంది. ల్యాప్టాప్ను ఉపయోగించే విధానం నేర్చుకునేందుకు రమేశ్ అనే వ్యక్తిని ట్యూటర్గా పెట్టుకున్నాడు. ల్యాప్టాప్ మీద ప్రయోగాలు చేస్తున్న సూరి తన ఆస్తుల వివరాలను అందులోకి ఎక్కించే లోపే హత్యకు గురయ్యాడు.
సూరి హత్య కేసుకు సంబంధించి ఇప్పటి వరకు సీసీఎస్ పోలీసులు 25 నుంచి 30 మంది నుంచి వాంగ్మూలాలను సేకరించారు. వీరిలో సూరికి ఎస్కార్టుగా ఉన్నవారు, అలేఖ్య అపార్ట్మెంట్ వాచ్మెన్, సినీ నిర్మాతలు, సూరి బంధువులు, స్నేహితులు ఉన్నారు. వీరిలో చాలామంది సూరి, భాను కిరణ్ కలిసి లావాదేవీలు చేస్తారని తెలుసని... అయితే, వాటి విలువ, ఇతర వివరాలు తెలియదని చెప్పినట్టుగా సమాచారం.
భాను కోసం గాలిస్తున్న పోలీసులు బృందాల్లో ఒకటి ఢిల్లీకి చేరుకున్నట్లు తెలిసింది. మరో బృందం ఉత్తరప్రదేశ్, బీహార్లలో ఆరా తీస్తున్నట్లు సమాచారం. భాను దేశం దాటి ఉంటాడా? అనే కోణంలోనూ విచారణ జరుపుతున్న పోలీసులు పలు విమానాశ్రయాల్లో సీసీ కెమెరాల దృశ్యాలను పరిశీలిస్తున్నారు.