సుస్మితా గంగూలీ థామస్ను కలిసిన ట్రైవ్యాలీ భారత విద్యార్థులు
విద్యార్థులు వేరే విశ్వవిద్యాలయంలో చేరి తమ చదువులు పూర్తి చేసుకోవడానికి గల అవకాశాలపై కూడా వివరాలు అడిగినట్లు ఆమె తెలిపారు. తాను శాన్ ఫ్రాన్సిస్కోలోని విదేశీ మిషన్కు, అమెరికా ఇమిగ్రేషన్, కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంటుకు లేఖలు రాసినట్లు ఆమె చెప్పారు. ఈ నెల 25వ తేదీన రాసిన తన లేఖలకు ఇప్పటి వరకు ఏ విధమైన సమాధానం రాలేదని ఆమె చెప్పారు. ట్రైవ్యాలీ విశ్వవిద్యాలయంలో చేరిన భారత విద్యార్థుల్లో ఎక్కువ మంది తెలుగువారే ఉన్నారు.
తమ వద్దకు వచ్చిన విద్యార్థుల్లో ఎక్కువ మంది ఏ విధమైన వీసా, ఇమిగ్రేషన్ నిబంధనలను ఉల్లంఘించలేదని, విశ్వవిద్యాలయం మోసపూరిత లక్షణం గురించి వారికి తెలియదని, చదువులను పూర్తి చేసుకోవడమే వారి ప్రధాన లక్ష్యమని, అందువల్ల వేరే విశ్వవిద్యాలయంలో చేరడానికి వారికి అవకాశం కల్పించాలని శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ కాన్సుల్ (కమ్యూనిటీ అఫైర్స్) అశోక్ కుమార్ సిన్హా అన్నారు. వీసా, ఇమిగ్రేషన్ నిబంధనల ఉల్లంఘనలో విద్యార్థుల పాత్ర కూడా ఉందనే వార్తల్లో నిజం లేదని ఆయన అన్నారు.