వైయస్ వారసులమని టిడిపితో కుమ్మక్కు: ముఖ్యమంత్రి కిరణ్పై జగన్ ఫైర్
వైయస్ వారసులు అయితే పావలా వడ్డీ, ఫీజు రియింబర్సు మెంటును ఎందుకు కొనసాగించడం లేదని ఆయన ప్రశ్నించారు. వైయస్ పేరుతో పెట్టే పార్టీ భారతీయ జనతా పార్టీతో కలవదన్నారు. వైయస్ఆర్ పేరుతోనే పార్టీ ఏర్పాటు చేయనున్నట్లు యువనేత తెలిపారు. ప్రొద్దుటూరులో ముస్లిం మైనార్టీ సదస్సులో మాట్లాడుతూ ముస్లింలకు కాంగ్రెసు చేసింది ఏమీ లేదన్నారు. కమిటీలు మీద కమిటీలు వేసి కాలయాపన చేసిందని ఆయన విమర్శించారు. ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు దేశవ్యాప్తంగా ఎందుకు అమలు చేయటం లేదని జగన్ ప్రశ్నించారు.
రామరాజ్యం ఎలా ఉంటుందో తెలియదని, అయితే రాజన్న స్వర్ణయుగాన్ని చూశానని వైయస్ జగన్ అన్నారు. మళ్లీ రెండేళ్ల తర్వాత స్వర్ణయుగమేనన్నారు. మహానేత వైయస్పై బురద చల్లుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వైయస్ వారసులమని చెప్పుకుంటూనే సిగ్గులేకుండా టీడీపీతో కుమ్మక్కు అయ్యారని జగన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రభుత్వానికి పాలించే హక్కులేదని జగన్ అన్నారు. ఇటువంటి ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపినా తప్పేనన్నారు.