హైదరాబాద్పై మెలిక పెట్టవచ్చు, అయినా తెలంగాణ ఖాయం: కెసిఆర్
సహాయ నిరాకరణ మీరు చేయండని మేమంతా మీకు అండగా ఉంటామని కెసిఆర్ హామీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ప్రభుత్వం ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని ప్రయత్నిస్తే ప్రజా ఉద్యమాలు నిర్మిస్తామని చెప్పారు. తెలంగాణ జెఏసి పిలుపు మేరకు మేం సహాయ నిరాకరణ చేపట్టేందుకు నిర్ణయించుకున్నామని ఉద్యోగ సంఘాలు సమావేశం అనంతరం మాట్లాడుతూ చెప్పాయి. మాకు సహకారం అందించాల్సిందిగా శనివారం భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు కిషన్రెడ్డి, టిఆర్ఎస్ అధ్యక్షుడు కెసిఆర్ను ఆదివారం కలిసి కోరామన్నారు. అయితే ఇధ్దరు అధ్యక్షులు సానుకూలంగా స్పందించారని చెప్పారు.
ఇవ్వాళ రేపట్లో మిగతా పార్టీల అధ్యక్షులను కూడా కలిసి మద్దతు కోరుతామని చెప్పారు. సహాయ నిరాకరణ చేస్తున్న ఉద్యోగులపై ఎలాంటి చర్యలకు తీసుకున్నా ఊరుకునేది లేదన్నారు. ఔట్ సోర్సింగ్ కూడా ఉండవద్దని ప్రభుత్వాన్ని ఆయన కోరారు. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఇందుకు హామీ ఇచ్చారని చెప్పారు. సహాయ నిరాకరణపై ప్రభుత్వం ఎస్మా ప్రయోగిస్తే ఊరుకునేది లేదన్నారు. అయితే తమకు తెలంగాణ ముఖ్యమని, ఉద్యోగాలు ముఖ్యం కాదన్నారు. భవిష్యత్తు తరాల కోసం మేం ఉద్యోగాలు కోల్పోవడానికి కూడా సిద్ధమేనని చెప్పారు.