భాను కిరణ్ ఆంధ్రలో ప్రవేశించాడా, లొంగుబాటుకు యత్నిస్తున్నాడా?
కుటుంబ సభ్యులు, బంధువులు, భాను సహచరుల కదలికలపై, ఫోన్ కాల్స్పై నిఘా పెట్టారు. ఏపీతో పాటు బెంగళూరు, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్లలో భాను తలదాచుకునే అవకాశం ఉన్న ప్రాంతాల్లో స్థానికులనే పోలీసులు ఇన్ఫార్మర్లుగా పెట్టుకున్నారు. భాను గన్మెన్ పోలీసులకు ఇచ్చిన సమాచారం మేరకు.. అతడి వద్ద ఉన్న డబ్బు కూడా అయిపోయినట్టేనని పోలీసులు ఓ అంచనాకు వచ్చినట్లు చెబుతున్నారు. పోలీసుల నిఘా పెరగడంలో సెల్ఫోన్నూ వినియోగించడం లేదని తెలుస్తోంది. ఆయన గన్మెన్ మన్మోహన్ అజ్ఞాతంలో ఉన్న సమయంలో ఒకే ఒక్కసారి కుటుంబ సభ్యులకు ఫోన్ చేశాడు. దాని ద్వారానే భాను, మన్మోహన్ తలదాచుకున్న స్థావరాన్ని పోలీసులు పసిగట్టగలిగారు. మన్మోహన్ చిక్కినా భాను మాత్రం తప్పించుకున్నాడు. ఈ స్థితిలో భాను కొద్ది రోజుల కిందట ఏపీలో అడుగుపెట్టి ఉంటాడని భావిస్తున్నట్టు ఓ దినపత్రిక రాసింది. సూరి వర్గీయులు కూడా భాను వేటలో ఉన్నట్టు సమాచారం. దీంతో భాను లొంగుబాటు మార్గం ఎంచుకుంటున్నట్టు తెలిసింది.