తెలంగాణ అంశంపై అట్టుడికిన లోకసభ, కెసిఆర్కు ఎన్డిఎ మద్దతు
కెసిఆర్, విజయశాంతి స్పీకర్ పోడియం వద్ద బైఠాయించారు. దీంతో సభను స్పీకర్ వాయిదా వేశారు. మంగళవారం తెలంగాణపై కెసిఆర్ ప్రతిపాదించిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించారు. బుధవారం చర్చకు అనుమతిస్తానని హామీ ఇచ్చారు. అయితే, బుధవారం జీరో అవర్లో మాట్లాడేందుకు అవకాశం ఇస్తానని స్పీకర్ చెప్పడంతో కెసిఆర్, విజయశాంతి ఆందోళనకు దిగారు. వెంటనే తెలంగాణపై చర్చను చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. బుధవారంనాడు లోకసభలో అనుసరించాల్సిన వ్యూహానికి మంగళవారం సాయంత్రం కెసిఆర్ ఎన్డిఎ భాగస్వామ్య పక్షాల నాయకులతో భేటీలో రూపకల్పన చేశారు. లోకసభ సమావేశం ప్రారంభం కావడానికి ముందు కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి పవన్ కుమార్ బన్సాల్ను కలిశారు. తెలంగాణపై చర్చకు అనుమతించాలని, లేదంటే తమకు తెలంగాణ ప్రాంతంలో ఇబ్బంది ఏర్పడుతుందని వారు బన్సాల్తో చెప్పారు.
తిరిగి సమావేశమైన తర్వాత కూడా సభ సద్దుమణగలేదు. తెరాస సభ్యులు స్పీకర్ పోడియం వద్ద బైఠాయించారు. ప్రశ్నోత్తరా సమయం చేపట్టడానికి సభాపతి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. తెలంగాణపై యుపిఎ ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకోవాలని ప్రతిపక్ష నాయకురాలు సుష్మా స్వరాజ్ డిమాండ్ చేశారు. ఈ ఏడాది పార్లమెంటులో బిల్లు ప్రతిపాదిస్తామని ప్రధాని డాక్ట్రర్ మన్మోహన్ సింగ్ ఒక్క మాట చెప్తే ఆందోళనలు ఆగిపోతాయని ఆమె చెప్పారు. తెలంగాణలో తీవ్రమైన ఆందోళనలు చెలరేగుతున్నాయని ఆమె చెప్పారు. పార్లమెంటులో బిల్లు ప్రతిపాదిస్తే తాము కూడా మద్దతిస్తామని ఆమె చెప్పారు. తెరాస సభ్యులు తమ పట్టు వీడికపోవడంతో మరోసారి లోకసభ వాయిదా పడింది.