బాలకృష్ణ వర్సెస్ లక్ష్మీపార్వతి: ఆమె హక్కులకు భంగం కలిగించవద్దు
అయితే తనను వేధిస్తున్నారంటూ లక్ష్మీపార్వతి చేసిన ఫిర్యాదు నేపధ్యంలో ఆమెకు తగిన రక్షణ కల్పించాల్సిందిగా బంజారాహిల్స్ అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ను ఆదేశించింది. ఎన్టీఆర్తో వివాహం విషయంలో లక్ష్మీపార్వతి గౌరవానికి, హక్కులకు భంగం కలిగించే అధికారం ఎవరికీ లేదని మానవ హక్కుల కమిషన్ తాత్కాలిక ఛైర్మన్ కె.పెదపేరిరెడ్డి స్పష్టం చేశారు. ఇకపై ఆమె విషయంలో బాలకృష్ణ, ఇతర కుటుంబ సభ్యులు ఎలాంటి జోక్యం చేసుకోవడానికి వీలులేదని శనివారం తీర్పు చెప్పారు. అలాగే బసవతారకం ట్రస్ట్, ఎన్టీఆర్ ట్రస్టులతో ఆమెకు సంబంధం లేదని పేర్కొన్నారు.
తనను మానసికంగా వేధిస్తున్నారంటూ ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణపై ఎన్టీఆర్ తెలుగుదేశం అధ్యక్షురాలు నందమూరి లక్ష్మీపార్వతి ఫిర్యాదు చేశారు. ఎన్టీ రామారావుతో తనకు జరిగిన వివాహంపై ప్రజల్లో అపోహలు కల్పించే దిశగా ప్రసార సాధనాల ద్వారా బాలకృష్ణ యత్నించారని, ఈ నేపథ్యంలో తనతో సహా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కు రక్షణను పోలీసులు తొలగించారని లక్ష్మీపార్వతి తన పిటిషన్లో ఆరోపించారు. తనకు, తన తల్లికి రక్షణ లేకుండా పోయిందని ఆమె ఆవేదన చెందారు. హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల మేరకే లక్ష్మీపార్వతికి తాము భద్రతను ఉపసంరించుకున్నట్లు హెచ్ఆర్సీకి బంజారాహిల్స్ పోలీసులు నివేదించిన దృష్ట్యా ఉత్తర్వులను జారీ చేసింది.
ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్, మేనేజింగ్ ట్రస్టీలకు సంబంధించి పలు సివిల్ కోర్టుల్లో వివాదాలు నడుస్తున్నందున తాము వాటిల్లోకి కూడా వెళ్ళబోమని కమిషన్ పేర్కొంది. లక్ష్మీపార్వతి ఫిర్యాదు నేపథ్యంలో ఆమెకు, ఆమె తల్లికి తగిన రక్షణ కల్పించాల్సిందిగా పోలీసులను ఆదేశించింది. ఇతర ఆస్తుల విషయంలో కమిషన్ జోక్యం చేసుకోదని, వాటిపై సివిల్ కోర్టును ఆశ్రయించాలని సూచించారు. ఎన్టీఆర్ భార్యగా తన హక్కులను కాపాడాలని, రక్షణ కల్పించాలని కోరుతూ లక్ష్మీపార్వతి 2008 సెప్టెంబరులో మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించారు.