కెసిఆర్ క్రాస్ వోటింగ్ చేసిన ఎమ్మెల్యేల రాజీనామాలను అడుగుతారా?
క్రాస్ వోటింగుకు పాల్పడిన శాసనసభ్యులకు షోకాజ్ నోటీసులు జారీ చేస్తారా, లేదంటే నేరుగా సస్పెండ్ చేస్తారా అనేది తెలియడం లేదు. అయితే, వారి నుంచి కెసిఆర్ రాజీనామాలు కోరే అవకాశం కూడా ఉందని అంటున్నారు. తెలంగాణ ఉద్యమం మంచి ఊపు మీద ఉన్న తరుణంలో తెలంగాణ సాధనకే కట్టుబడి ఉన్న శాసనసభ్యులు కాంగ్రెసు పార్టీ అభ్యర్థలకు వోటేశారనే ఆరోపణలు పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టాయి. క్రాస్ వోటింగుకు పాల్పడిన శాసనసభ్యుల్లో గుబులు రేగుతోంది.
కాగా, తెరాస ఎమ్మెల్సీ అభ్యర్థిగా మహ్మద్ అలీని రంగంలోకి దింపింది. ఆయనకు 11 ఓట్లు వచ్చాయి. తెరాసకు ఉన్న ఓట్లు కూడా అంతే. కానీ బిజెపి సభ్యులు ఇద్దరు, తెలుగుదేశం తిరుగుబాటు శాసనసభ్యుడు పోచారం శ్రీనివాస రెడ్డి తెరాస అభ్యర్థికి ఓటేశారని చెబుతున్నారు. దీన్నిబట్టి చూస్తే, తెరాస శాసనసభ్యులు ముగ్గురు పార్టీ అభ్యర్థికి ఓటేయలేదని తేలింది. దీంతో కెసిఆర్పై విమర్శలు ప్రారంభమయ్యాయి.