వైయస్ జగన్ను కిరణ్ కుమార్ రెడ్డి భయపెడుతున్నారా?
కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన తర్వాత మంత్రులను కట్టడి చేయడంలో, కాంగ్రెసుకు అనుకూలంగా పని చేయించడంలో విజయం సాధించారనే చెప్పాలి. మంత్రులు ఎవరు కూడా రోశయ్య మాట వినేవారు కాదనే ప్రచారం అప్పట్లో ముమ్మరంగా సాగింది. అయితే, ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. మంత్రులకు బాధ్యతలు అప్పగిస్తూ, వారికి లక్ష్యాలు నిర్దేశిస్తూ పని చేయిస్తున్నారు. తన సొంత మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకోవడానికి రోశయ్యకు అప్పట్లో అవకాశం చిక్కలేదు. కిరణ్ కుమార్ రెడ్డి తనకు సహకరిస్తారని భావించినవారిని మంత్రివర్గంలోకి తీసుకున్నారు. వైయస్ జగన్ను ఎదుర్కోవడానికి ప్రస్తుతం మంత్రివర్గంలో నలుగురైదుగురు మంత్రులున్నారు. స్వయంగా వైయస్ జగన్ బాబాయ్ ఇప్పుడు బ్రహ్మాస్త్రంగా మారారు.
మంత్రులు డిఎల్ రవీంద్రా రెడ్డి, వైయస్ వివేకానంద రెడ్డి, పి. శంకరరావు వంటివారే కాకుండా ఇతర మంత్రులు కూడా జగన్కు వెసులుబాటు కల్పించడం లేదు. అనంతపురం జిల్లాలో వైయస్ వైయస్ రాజశేఖర రెడ్డికి సన్నిహితులైన రఘువీరా రెడ్డి, శైలజానాథ్లకు మంత్రి పదవులు ఇచ్చి, వారి వ్యతిరేకి అయిన జెసి దివాకర్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వలేదు. దానివల్ల వైయస్ రాజశేఖర రెడ్డికి సన్నిహితులై అయినా ఆ ఇద్దరు మంత్రులు కిరణ్ కుమార్ రెడ్డికి సహకరిస్తున్నారు. అలా వ్యూహాత్మకంగా ముందుకు సాగుతూ కిరణ్ కుమార్ రెడ్డి జగన్కు నిద్రపట్టకుండా చేస్తున్నారు. రాజకీయ వ్యూహాలను కిరణ్ కుమార్ రెడ్డి వైయస్ రాజశేఖర రెడ్డి నుంచే నేర్చుకున్నట్లున్నారు. దాన్నే వైయస్ జగన్పై ప్రయోగిస్తున్నారని చెప్పవచ్చు.