పాకిస్తాన్ కు షాకిచ్చిన కేంద్రం: వారందరూ ఉగ్రవాదులే: జాబితా విడుదల
దేశ సార్వభౌమత్వానికి, అంతర్గత భద్రతకు ముప్పుగా పరిణమించిన ఉగ్రవాద మూకల ఆట కట్టించేందుకు కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో పలు విధ్వంసక చర్యలకు పాల్పడుతున్న 23 మందిని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తాజాగా ఉగ్రవాదులుగా ప్రకటించింది. యూఏపీఏ సెక్షన్ 35 కింద వీరిని అధికారికంగా ఉగ్రవాదుల జాబితాలో చేర్చినట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
ఈ జాబితాలో చేరిన వారంతా జైషే మహ్మద్ (JeM), లష్కరే తోయిబా (LeT), జమాత్-ఉద్-దవా, ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF) వంటి నిషేధిత సంస్థలతో సంబంధాలు కలిగి ఉన్నట్లు తేలింది. వీరంతా సరిహద్దుల అవతల నుంచి పెద్ద ఎత్తున కార్యకలాపాలు సాగిస్తున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. ఈ ఉగ్రవాదులు ప్రధానంగా నిధుల సమీకరణ, కొత్తవారిని రిక్రూట్ చేయడం, వారికి ఆయుధ శిక్షణ ఇవ్వడం వంటి విద్రోహ చర్యలకు పాల్పడుతున్నారు.

తాజా జాబితాలోని 23 మందిలో 17 మంది పాకిస్థాన్కు చెందిన పౌరులు కాగా, ఆరుగురు భారతీయ పౌరులు ఉన్నారు. వీరు పాకిస్థాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ తో పాటు పాకిస్థాన్లోని వివిధ ప్రాంతాల్లో తలదాచుకుంటూ భారత్పై కుట్రలు పన్నుతున్నారు. డ్రోన్ల ద్వారా సరిహద్దుల్లోకి ఆయుధాలు, మందుగుండు సామగ్రిని చేరవేయడం, అలాగే జమ్ముకశ్మీర్లో భద్రతా దళాల కదలికలపై నిఘా ఉంచి దాడులకు ప్లాన్ చేయడం వంటి పనులు చేస్తున్నారు.
ఆర్థిక వనరులపై దెబ్బ కొట్టే వ్యూహం
కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల భవిష్యత్తులో జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) ఈ ముఠాల ఆర్థిక వనరులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం లభిస్తుంది. ఈ చట్టం కింద ఒక వ్యక్తిని ఉగ్రవాదిగా ప్రకటించడం ద్వారా ఆయా వ్యక్తులకు సంబంధించిన బ్యాంకు ఖాతాలను నిలిపివేయవచ్చు. వారి స్థిర, చరాస్తులను జప్తు చేయడంతో పాటు విదేశాల నుంచి వారికి అందే ఆర్థిక వనరులను పూర్తిగా అడ్డుకొనేందుకు వీలవుతుంది.
పలు పాత దాడులతో ఉన్న సంబంధాలు
ఈ 23 మందిలో పలువురు గతంలో దేశంలో జరిగిన దాడులతో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయి. 2016 నవంబర్ 29న కశ్మీర్లోని నగ్రోటా ఆర్మీ క్యాంప్, 2022 ఏప్రిల్ 22న జమ్మూలోని సుంజ్వాన్ సమీపంలో భద్రతా బలగాలపై జరిగిన దాడుల్లో వీరి ప్రమేయం ఉన్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ ఉగ్రవాదులంతా భారత్ను నిరంతరం అస్థిరపరచడమే లక్ష్యంగా పని చేస్తున్నారు.
ప్రభుత్వం విడుదల చేసిన ఈ జాబితాలో జైషే మహ్మద్ సంస్థకు చెందిన మసూద్ ఇలియాస్ కాశ్మీరీ, మహ్మద్ ముసాదిక్, ముఫ్తీ మహ్మద్ అస్గర్ ఖాన్, హఫీజ్ అబ్దుల్ శకూర్తో పాటు లష్కరే తోయిబాకు చెందిన ఫిర్దౌస్ అహ్మద్ భట్, హరూన్ రషీద్ గనాయ్, బిలాల్ అహ్మద్ మీర్ ఉన్నారు. అల్ ఖైదా, ఐసిస్ వంటి గ్లోబల్ టెర్రర్ సంస్థలతో లింకులు ఉన్న మహ్మద్ షహీద్ ఫైసల్ కూడా ఇందులో ఉన్నాడు.
సరిహద్దు అవతల సురక్షిత స్థావరాల నుంచి ఆపరేట్ చేస్తున్న ఇలాంటి శక్తులపై భారత్ కఠిన వైఖరిని అవలంబిస్తోంది. అంతర్జాతీయ సమాజం ముందు పాకిస్థాన్ ద్వంద్వ నీతిని ఎండగట్టడానికి ఈ తాజా చర్యలు ఎంతగానో ఉపయోగపడతాయి. దేశ రక్షణను పటిష్టం చేయడంతో పాటు టెర్రర్ ఫైనాన్సింగ్ నెట్వర్క్లను సమూలంగా రూపుమాపడానికి కేంద్ర హోం శాఖ చట్టబద్ధమైన శక్తులన్నింటినీ ఉపయోగించుకుంటోంది.












Click it and Unblock the Notifications