సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులుపై ధ్వజమెత్తిన కెసిఆర్
అన్యాయాలపై, దోపిడీపై పోరాటం చేస్తామని చెప్పే సిపిఎం తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై మాట్లాడడం లేదని ఆయన విమర్సించారు. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా నాయకత్వం కూడా సిపిఎం ఆంధ్రా నుంచే తెచ్చి పెట్టిందని ఆయన అన్నారు. తెలంగాణ నాయకుల పరాధీన బానిస మనస్తత్వం వల్లనే తెలంగాణ బాధపడుతోందని ఆయన అన్నారు. తెలంగాణను ఎవరూ అడ్డుకోలేరని, తెలంగాణ వచ్చి తీరుతుందని, తెలంగాణ వస్తే తెలంగాణ యావత్తు మారిపోతుందని, హైదరాబాదు కూడా ప్రజల జీవనానికి అనుగుణంగా మారుతుందని ఆయన చెప్పారు. తెలంగాణవాళ్లు ముఖ్యమంత్రిగా ఉంటే ఏడాది కూడా ఉండనిచ్చారా అని ఆయన అడిగారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ బాగుపడే వాతావరణమే లేదని ఆయన అన్నారు. మా తెలంగాణ మాకు కావాలని అడుగుతున్నామని ఆయన అన్నారు.
హైదరాబాదు సంగతేమిటని అడుగుతున్నారని, హైదరాబాదు కట్టిందెవరని, మన రక్తం మన చెమటతో హైదరాబాదు నిర్మిచారని ఆయన అన్నారు. చెప్పులు లేకుండా హైదరాబాదు వచ్చారని, కోట్లాది రూపాలు సంపాదించుకున్నారని ఆయన అన్నారు. ప్రపంచంలోనే అత్యధిక ధనవంతుడు నిజాం నవాబు అని, లండన్ మ్యూజియంలోని కోహినూర్ వజ్రం మనదని, మిగులు బడ్జెట్ ఉండేదని, అంతటి సంపద్వంతమైన తెలంగాణలో తాము పెట్టుబడి పెట్టామని అంటారని ఆయన అన్నారు. ఎట్టి పరిస్థితిలో కూడా హైదరాబాదు వివాదం కాకూడదని ఆయన అన్నారు. 1956లో ఏ ప్రాంతాన్నైతే కలిపి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేశారో, ఆలా కలిపిన ప్రాంతమే తమకు కావాలని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం త్యాగాల వల్ల ఏర్పడలేదని, కుట్రల వల్ల ఏర్పడిందని ఆయన అన్నారు.