ఎమ్మెల్సీ ఎన్నికలు: ఊపందకున్న బేరసారాలు, క్యాంపులు

చిత్తూరు జిల్లా ఎన్నికను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో పాటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. ఇది వారిద్దరికి కూడా సొంత జిల్లానే. కాగా, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి కాంగ్రెసు శాసనసభ్యులు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, కుతూహలమ్మ వంటి అసమ్మతి శాసనసభ్యుల నుంచి వ్యతిరేకత ఎదురవుతోంది. దీంతో వారు వైయస్ జగన్ వర్గానికి చెందిన తిప్పారెడ్డిని గెలిపించేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
కడప జిల్లా సంగతి సరేసరి, వైయస్ జగన్కు ఈ ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారింది. అయితే, జగన్ వర్గానికి కళ్లెం వేసేందుకు మంత్రులు వైయస్ వివేకానంద రెడ్డి, డిఎల్ రవీంద్రా రెడ్డి, కన్నా లక్ష్మినారాయణ తీవ్రంగా ప్రయత్నాలు సాగిస్తున్నారు. అనంతపురం నియోజకవర్గంలో కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీల మధ్య పోటీ ఉంది. అయితే, కాంగ్రెసు పార్టీ శానససభ్యుడు జెసి దివాకర్ రెడ్డి పార్టీ అభ్యర్థి పాటిల్ వేణుగోపాల్ రెడ్డికి సహకరిస్తారా, లేదా అనేది అనుమానంగా మారింది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మెట్టు గోవింద రెడ్డి కాంగ్రెసు ఓట్ల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
కర్నూలులో కాంగ్రెసు అభ్యర్థి ఎస్వీ మోహన్ రెడ్డి విజయానికి పెద్దగా ఢోకా ఉండకపోవచ్చు. కాంగ్రెసు అభ్యర్థి జగన్ వర్గానికి చెందిన శానససభ్యురాలు శోభా నాగిరెడ్డి సోదరుడు. దీంతో జగన్ వర్గం పోటీకి దిగలేదు. నెల్లూరు నియోజకవర్గంలో ఎన్నిక కాంగ్రెసుకు చెందిన ఆనం సోదరులకు, జగన్ వర్గానికి చెందిన మేకపాటి సోదరులకు మధ్య పోటీగా మారింది.
తూర్పు గోదావరి జిల్లాలో వైయస్ జగన్ వర్గం కాంగ్రెసు అభ్యర్థిని సవాల్ చేస్తున్నారు. అయితే, పిసిసి జగన్ వర్గాన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఇక్కడ త్రిముఖ పోటీ జరిగే అవకాశం ఉంది. పశ్చిమ గోదావరి జిల్లాలోని రెండు స్థానాలకు కూడా పోటీ తీవ్రంగానే ఉంది. శ్రీకాకుళం జిల్లాలో తిరుగుబాటు అభ్యర్థులు ఉన్నా కాంగ్రెసు అభ్యర్థి విజయానికి ఢోకా ఉండకపోవచ్చు.












Click it and Unblock the Notifications