నేరం రుజువైతే ఉరి తీయండి: సస్పెన్షన్కు గురైన తెరాస ఎమ్మెల్యే

నాలుగేళ్ల నుంచి తాను తెరాసలో ఉన్నానని, ఎప్పుడూ తప్పు చేయలేదని విద్యాసాగర రావు అన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకే తాను పనిచేశానని ఆయన చెప్పారు. తనకు డబ్బులే ప్రధానమనుకుంటే కాంట్రాక్టులు చేసేవాడినని ఆయన చెప్పారు. తాను క్రాస్ వోటింగుకు పాల్పడినట్లు రుజువైతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని ఆయన చెప్పారు. తప్పు చేసినట్లు రుజువైతే ప్రజల సమక్షంలో ఆత్మహత్య చేసుకోవడానికి కూడా తాను సిద్ధంగా ఉన్నానని ఆయన అన్నారు.
తమపై సస్పెన్షన్ వేటు చాలా బాధ కలిగించిందని ఏనుగు రవీందర్ రెడ్డి అన్నారు. కెసిఆర్ ఏ విధంగా ఆదేశిస్తే ఆ విధంగా నడుచుకున్నానని ఆయన చెప్పారు. అడిగిన వెంటనే రాజీనామాకు సిద్ధపడినట్లు ఆయన తెలిపారు. సీమాంధ్ర మీడియా ప్రచారానికి, ఎమ్మార్పీయస్ నేత మందకృష్ణ మాదిగ వ్యాఖ్యలకు, తెలుగుదేశం నేతృత్వంలోని ఉస్మానియా విద్యార్థుల ఒత్తిడికి తలొగ్గి తమపై చర్యలు తీసుకోవడం సరి కాదని ఆయన అన్నారు. తమపై వచ్చిన ఆరోపణల మీద విచారణ జరిపించాలని, అందుకు కమిటీ వేయాలని తాము అడుగుతున్నామని ఆయన చెప్పారు. గతంలో వైయస్ రాజశేఖర రెడ్డి పది కోట్ల రూపాయలు ఆశ చూపినా తాము లొంగలేదని కావేటి సమ్మయ్య చెప్పారు.












Click it and Unblock the Notifications