కడప, పులివెందుల టిడిపి అభ్యర్థులు పుత్తా నరసింహారెడ్డి, బిటెక్ రవి
పులివెందుల నుంచి ఎమ్మెల్సీ సతీష్రెడ్డి తన సోదరికి టిక్కెట్టు అడుగుతున్నారు. స్థానిక నేత ఎం.రవీంద్రనాథ్రెడ్డి(బీటెక్ రవి) పేరు మొదటినుంచి ప్రధానంగా పరిశీలనలో ఉంది. తమ కుటుంబానికి రెండు సీట్లు ఇస్తే పోటీకి సిద్ధమని, తదనంతర పరిణామాలను దృష్టిలో ఉంచుకుని రాజ్యసభ టిక్కెట్టు హామీ ఇవ్వాలని కందుల సోదరులు చేసిన ప్రయత్నించారు. శివానందరెడ్డి పులివెందుల అసెంబ్లీకి, రాజమోహనరెడ్డి కడప లోక్సభకు పోటీచేస్తారనేది ఆ ప్రతిపాదన. కందుల సోదరులతో చంద్రబాబు మంగళవారం రాత్రి విడిగా గంటసేపు చర్చించారు. రాజ్యసభ టిక్కెట్టు విషయంలో హామీ ఇచ్చే పరిస్థితి లేదని చంద్రబాబు తేల్చిచెప్పినట్లు సమాచారం. దీంతో కందుల సోదరులు అసంతృప్తిగా వెనుతిరిగారు. వీరు కాంగ్రెస్ వైపు మొగ్గే అవకాశముందని భావిస్తున్నారు.
కందుల సోదరుల డిమాండ్ నేపథ్యంలో తలెత్తిన పరిణామంతో మైసూరారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పుత్తా నరసింహారెడ్డిలలో ఒకరు అభ్యర్థి అయ్యే అవకాశముంది. మైసూరా తొలినుంచి పోటీకి విముఖంగా ఉన్నారు. పార్టీ తప్పదని ఆదేశిస్తే మాత్రం పోటీకి సిద్ధమంటున్నారు. ఈ నేపథ్యంలో రాజమోహనరెడ్డి కాకుంటే పుత్తా నరసింహారెడ్డే అభ్యర్థి అయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో పులివెందుల తప్ప మిగిలిన చోట్ల తెలుగుదేశం బలమైన పోటీనిచ్చింది. మైదుకూరులో మాత్రం తెదేపా కొంత గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. కాంగ్రెస్ ఓట్ల చీలికతో లబ్ధి పొందేందుకు పార్టీ ప్రయత్నిస్తోంది. చంద్రబాబు ఏడు రోజలు పాటు కడప లోకసభ నియోజకవర్గంలో ప్రచారం చేయాలని అనుకుంటున్నారు.