పాకిస్థాన్ తో సుదీర్ఘ కాలంపాటు యుద్ధానికి రెడీ : రాజ్ నాథ్ సింగ్ సంచలనం
గతేడాది ఏప్రిల్ 22 న పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది అమాయక టూరిస్టులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే పాకిస్థాన్ చర్యకు ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. మే 7 నుంచి 10 మధ్య జరిగిన ఈ ఆపరేషన్ లో పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని 9 కీలక ఉగ్ర స్థావరాలను భారత సైన్యం ధ్వంసం చేసింది. అలాగే వందలాది మంది ఉగ్రమూకలను హతమార్చింది. అయితే తాజాగా భారత రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ తాజాగా ఆపరేషన్ సింధూర్ పై కీలక విషయాలను వెల్లడించారు. భారత్ తన సొంత రూల్స్, నిబంధనల మేరకే ఆపరేషన్ సింధూర్ ను నిలిపివేసిందని అన్నారు. అవసరమైతే పాకిస్థాన్ తో సుదీర్ఘకాలం యుద్ధం చేసేందుకు భారత్ సిద్ధంగా ఉందని తెలిపారు. ఏప్రిల్ 30, 2026న జరిగిన నేషనల్ సెక్యూరిటీ సమ్మిట్ 2.0 లో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
ఈ సమావేశంలో ఆపరేషన్ సింధూర్ గురించి పలు విషయాలను వెల్లడించారు. తమ సామర్థ్యం తగ్గిపోయి ఆపరేషన్ సింధూర్ ను ముగించలేదని కొన్ని షరతులు, రూల్స్ ప్రకారం తామే సొంతంగా ఆపరేషన్ ను ముగించామని రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ పేర్కొన్నారు. పాకిస్థాన్ తో పూర్తి స్థాయిలో సుదీర్ఘకాలం పాటు యుద్ధం చేయాల్సి వచ్చినా అందుకు భారత్ సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్థాన్ అణు దాడి చేస్తామని బెదిరించిందని కానీ భారత్ ఏమాత్రం లెక్కచేయకుండా లక్ష్యాన్ని పూర్తి చేసిందని అన్నారు. ఈ మేరకు భారత సైన్యంపై ఆయన ప్రశంసలు కురిపించారు. అలాగే ప్రధాని మోదీ నాయకత్వంలోనే ఇది సాధ్యమైందని అన్నారు.

గతంలో భారత్ పై దాడులు జరిగితే కేవలం దౌత్య పరమైన ప్రకటనలకే పరిమితం అయ్యే వారిమని కానీ ఇప్పుడు పరిస్థితి మారిందని.. ఉగ్రవాదాన్ని ఏ రూపంలో ఉన్నా సహించేది లేదని రాజ్ నాథ్ సింగ్ హెచ్చరించారు. ఓవైపు భారత్ ఐటీ రంగంలో దూసుకెళ్తోంటే పాకిస్థాన్ మాత్రం టెర్రరిజానికి కేంద్రంగా మారిందని ఎద్దేవా చేశారు. అవసరమైనప్పుడు యుద్ధ సామాగ్రిని పెంచుకోవడంలో ఇప్పుడు భారత్ బలంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఇక ప్రస్తుతం రాజ్ నాథ్ సింగ్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.












Click it and Unblock the Notifications