మంచిర్యాల–వరంగల్ గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవేపై లేటెస్ట్ అప్డేట్!
మంచిర్యాల వరంగల్ గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మాణం కోసం ఎదురు చూస్తున్న మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, హనుమకొండ జిల్లాల ప్రజలకు కీలక అలెర్ట్. మంచిర్యాల వరంగల్ గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే అంచనా వ్యయం సుమారు రూ.3,440 కోట్లు. 2023 మార్చిలో మెఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ కు మూడు ప్యాకేజీలుగా కాంట్రాక్టులు ఇచ్చారు.
భారత్ మాలా పరియోజన కింద మంచిర్యాల వరంగల్ గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే
2023 జూలైలో ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా మంచిర్యాల వరంగల్ గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే శంకుస్థాపన జరిగింది. ఈ ప్రాజెక్టు నాగపూర్-విజయవాడ ఎకనమిక్ కారిడార్లో భాగంగా భారత్ మాలా పరియోజన కింద చేపట్టారు. ఎన్హెచ్-163జీగా పిలువబడే ఈ గ్రీన్ఫీల్డ్ హైవే మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం నర్వా గ్రామం నుంచి హనుమకొండ, వరంగల్ జిల్లా ఊరుగొండ గ్రామం వరకు విస్తరించి ఉంది.

మంచిర్యాల వరంగల్ గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే రూట్ ఇదే
మొత్తం పొడవు సుమారు 108 నుంచి 112 కిలోమీటర్లు ఉంటుంది. ఇది నాలుగు వరుసల యాక్సెస్ కంట్రోల్డ్ రహదారి. దీని రూట్ మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, హనుమకొండ జిల్లాల మీదుగా వెళ్తుంది.అయితే నిర్మాణ పనులకు సంబంధించి తాజా అప్డేట్ విషయానికి వస్తే ఎలాంటి ఆటంకాలు లేకుండా కొనసాగేలా అవసరమైన చర్యలు చేపట్టాలని మంచిర్యాల కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు.
జాతీయ రహదారి నిర్మాణ పనులపై కలెక్టర్
రైతులు, నిర్వాసితులకు సంబంధించిన సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి నిబంధనల ప్రకారం పరిష్కరించాలని, సమస్యల కారణంగా జాతీయ రహదారి నిర్మాణ పనులు నిలిచిపోకుండా ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. నేడు నేషనల్ హైవే నిర్మాణ పనుల పురోగతి, భూసేకరణ, నిర్వాసితులకు పరిహారం చెల్లింపులు తదితర అంశాలపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.
సమస్యలను రైతులతో చర్చించి పరిష్కరించాలని ఆదేశం
నేషనల్ హైవే నిర్మాణ పనులకు ఎలాంటి ఆటంకాలు రాకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. భూసేకరణ, పరిహారం చెల్లింపులు తదితర అంశాల్లో క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యలను రైతులతో చర్చించి పరిష్కరించాలని ఆదేశించారు. ప్రస్తుతం భూసేకరణ ప్రక్రియ చాలా వరకు పూర్తయింది. కొన్ని చోట్ల పనులు ముమ్మరంగా సాగుతున్నాయి.
ఉత్తర తెలంగాణలో రవాణా సౌకర్యం ఈ నేషనల్ హైవేతో మెరుగు
మంచిర్యాల జిల్లా వైపు కొంత కిలోమీటర్ల మేర నిర్మాణం జరుగుతోంది. అయితే కొన్ని ప్రాంతాల్లో రైతుల సమస్యలు, కోర్టు కేసుల కారణంగా జాప్యం జరుగుతోంది. కలెక్టర్ సమీక్షలో ఈ అంశాలపై ప్రత్యేక దృష్టి సారించి, పరిహారం త్వరగా చెల్లించి పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ హైవే పూర్తయితే ఉత్తర తెలంగాణలో రవాణా సౌకర్యం బాగా మెరుగుపడుతుంది.
మంచిర్యాల నుంచి వరంగల్ వరకు తగ్గనున్న ప్రయాణ సమయం
మంచిర్యాల నుంచి వరంగల్ వరకు ప్రయాణ సమయం తగ్గుతుంది. పరిశ్రమలు, వ్యవసాయ ఉత్పత్తుల రవాణాకు ఎంతో ఉపయోగపడుతుంది. అధికారులు సమన్వయంతో పనిచేస్తే త్వరలోనే ప్రాజెక్టు ముందుకు సాగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications