ఉప ఎన్నికలు: చంద్రబాబుకు ఆదిలోనే తిరుగులేని దెబ్బ
లోకసభ స్థానానికి అభ్యర్థుల ఎంపికలో తలెత్తిన విభేదాలు ఇద్దరు బలమైన నాయకులు కందుల రాజమోహన్ రెడ్డి, కందుల శివానంద రెడ్డి తెలుగుదేశం పార్టీకి స్వస్తి చెప్పి కాంగ్రెసు పార్టీలో చేరారు. కందుల సోదరులకు కడప లోకసభ స్థానంలో తగిన బలం ఉంది. పుత్తా నరసింహా రెడ్డి వంటి పేర్లు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులుగా తెర మీదికి వచ్చాయి. అయితే, అనివార్యమైన స్థితిలో చంద్రబాబు లోకసభ స్థానంలో ఎంవి మైసురా రెడ్డిని పోటీకి దించుతున్నట్లు తెలుస్తోంది. మైసురా రెడ్డితో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చర్చలు జరిపినట్లు తెలిసింది. మైసురా రెడ్డిని కాంగ్రెసు పార్టీలోకి ఆహ్వానించినట్లు సమాచారం.
తన ప్రత్యర్థి వైయస్ రాజశేఖర రెడ్డి మృతి చెందడం, వైయస్ జగన్ కాంగ్రెసు పార్టీ నుంచి వెళ్లిపోవడం వంటి కారణాల వల్ల కాంగ్రెసులోకి రావాలని, పార్టీలో తగిన ప్రాధాన్యం ఇస్తామని కిరణ్ కుమార్ రెడ్డి మైసురా రెడ్డికి నచ్చజెప్పే ప్రయత్నం చేసినట్లు చెబుతున్నారు. దీంతో మైసురా రెడ్డి కాంగ్రెసులోకి వెళ్లిపోతారేమోనని చంద్రబాబు అనుమానించినట్లు చెబుతున్నారు. కడప అభ్యర్థిగా ఎంపిక చేసి మైసురా రెడ్డి ఫిరాయింపును చంద్రబాబు నిరోధించినట్లు చెబుతున్నారు. అయితే, మైసురా రెడ్డి ఏ మేరకు విజయం కోసం శ్రమిస్తారనేది అనుమానంగానే ఉందని అంటున్నారు.
ఇదిలా వుంటే, పులివెందుల అభ్యర్థి బిటెక్ రవిపై స్థానికంగా తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. మండల స్థాయి నాయకుడిని శాసనసభా స్థానానికి అభ్యర్థిగా ఎంపిక చేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. రాంగోపాల్ రెడ్డి, సతీష్ రెడ్డి వంటి నాయకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ తెలుగుదేశం పార్టీకి సహకరించే స్థితిలో లేరు. అభ్యర్థుల ఎంపికలో చంద్రబాబు వైఖరిపై కడప లోకసభ స్థానంలోనూ పులివెందుల శాసనసభా స్థానంలోనూ విమర్శలు ఎదురవుతున్నాయి.