పూరీ జగన్నాథ రథయాత్రలో తొక్కిసలాట.. ఒకరి మృతి, 120 మందికి గాయాలు !!
ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఒడిశాలోని పూరీ జగన్నాథ రథయాత్రలో విషాద ఘటన చోటుచేసుకుంది. భారీ ఎత్తున భక్తులు గుండిచా ఆలయం సమీపంలోకి చేరడంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగినట్టు చెబుతున్నారు. ఈ దుర్ఘటనలో ఒక భక్తుడు మృతిచెందగా.. 120 మందికి పైగా గాయపడినట్లు అధికారులు తెలిపారు. క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని సమాచారం. ఈ వ్యవహారం దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
కాగా ప్రతి ఏడాది నిర్వహించే జగన్నాథ రథయాత్రను తిలకించేందుకు దేశ విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు పూరీకి తరలివస్తుంటారు. ఈసారి కూడా తెల్లవారుజాము నుంచే భక్తుల రద్దీ భారీగా పెరిగందని అంటున్నారు. ఈ క్రమంలోనే జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవి రథాలను దర్శించేందుకు.. భక్తులు ఒకేచోట గుమిగూడడంతో పరిస్థితి అదుపు తప్పినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో గుండిచా ఆలయం సమీపంలో ఒక్కసారిగా తొక్కిసలాట జరగడంతో పలువురు కిందపడిపోయారు.

ఇక ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, విపత్తు నిర్వహణ బృందాలు వెంటనే రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి. గాయపడిన వారిని అంబులెన్స్ల ద్వారా సమీప ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. స్వల్ప గాయాలైన వారికి అక్కడికక్కడే వైద్య సిబ్బంది ప్రథమ చికిత్స అందించారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు వెంటనే స్పందించి పరిస్థితిని సమీక్షించారు. తొక్కిసలాటకు దారితీసిన కారణాలపై పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టాలని ఆదేశించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అదనపు భద్రతా చర్యలు చేపట్టనున్నట్లు అధికారులు వెల్లడించారు.
మరోవైపు రథయాత్ర కోసం ఒడిశా ప్రభుత్వం భారీ భద్రతా ఏర్పాట్లు చేసింది. వేలాది మంది పోలీసు సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది, వైద్య బృందాలు, అత్యవసర సేవల సిబ్బందిని విధుల్లో నియమించింది. సీసీటీవీ కెమెరాల ద్వారా మొత్తం రథయాత్ర మార్గాన్ని పర్యవేక్షిస్తున్నప్పటికీ, ఒకేసారి భారీ సంఖ్యలో భక్తులు ఒక ప్రాంతంలోకి చేరుకోవడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకున్నట్లు అధికారులు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications