జగన్ క్యాంప్ ఎమ్మెల్యేలు సామూహిక రాజీనామాలు చేస్తారా?
జగన్ వెంట నడుస్తున్న నలుగురు శానససభ్యులకు కాంగ్రెసు పార్టీ నాయకత్వం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. వారు వివరణ కూడా ఇచ్చారు. అయితే వారిపై ఇంకా చర్యలు తీసుకోలేదు. వారిపై చర్యలు తీసుకున్న తర్వాత మరి కొంత మందికి షోకాజ్ నోటీసులు జారీ చేయాలనే ఆలోచనలో కాంగ్రెసు నాయకత్వం ఉన్నట్లు చెబుతున్నారు. కాగా, తెలుగుదేశం పార్టీకి చెందిన ఇద్దరు శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, బాలనాగిరెడ్డిలపై చర్యలు తీసుకునే దిశగా శాసనసభ డిప్యూటీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ చర్యలు చేపట్టారు. ప్రజారాజ్యం పార్టీకి చెందిన శోభా నాగిరెడ్డిపై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. జగన్ వెంట నడుస్తున్న ప్రజారాజ్యం పార్టీ శాసనసభ్యుడు కాటసాని రాంరెడ్డి జగన్కు దూరమై మళ్లీ ప్రజారాజ్యం పార్టీలోకి వచ్చారు. దాదాపు మరో 20 మంది కాంగ్రెసు శాసనసభ్యులు జగన్ వెంట నడుస్తున్నట్లు భావిస్తున్నారు.
ఉప ఎన్నికల్లో వైయస్ విజయమ్మ, వైయస్ జగన్ విజయాలు దాదాపుగా ఖరారైనట్లు భావిస్తున్నారు. మంగళవారం సాయంత్రం హైదరాబాదుకు చేరుకున్న వైయస్ జగన్ రాత్రి తన వర్గానికి చెందిన శాసనసభ్యులతో సమావేశమయ్యారు. రాజీనామాలకు సంబంధించిన వ్యూహాన్ని ఆయన ఖరారు చేయాల్సి ఉంది. చాలా మంది శాసనసభ్యులు రాజీనామాలు చేయడానికే సిద్ధపడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.