వారసత్వంపై చంద్రబాబు తగ్గినా వెనక్కి తగ్గని హరికృష్ణ
తమ అండతో ఎన్టీఆర్ నుండి పార్టీ పగ్గాలు దొరక బుచ్చుకొని ఆ తర్వాత చంద్రబాబు తమను అవసరం ఉన్నప్పుడు ఉపయోగించుకొని తర్వాత తమను పక్కన పెట్టడం పట్ల కూడా హరికృష్ణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రతి ఎన్నికల్లో నందమూరి కుటుంబాన్ని ప్రచారానికి ఉపయోగించుకొని ఆ తర్వాత పక్కన పెట్టడం ద్వారా చంద్రబాబు తన అధికారం కోసం తమను యూజ్ త్రో గా వాడుకుంటున్నారన్న ఆవేదన హరికృష్ణలో ఉందని పార్టీ వర్గాలే చెప్పుకుంటున్నట్టుగా తెలుస్తోంది. సీనియర్ ఎన్టీఆర్ తర్వాత ఆయన వారసుడిగా బాలకృష్ణ తెరపైకి వచ్చినప్పటికీ లక్ష్మీ పార్వతిని బూచీగా చూపి బాబు పార్టీని తన చేతుల్లోకి తీసుకున్నాడు. అయితే బాలకృష్ణ పేరు మళ్లీ రాకుండా ఆయనతో వియ్యమందుకొని బాలయ్యను సైలెంట్ చేశాడు. అదే తరహాలో నందమూరి వంశం కారణంగా ఇటీవల స్టార్ ఇమేజ్ పొందిన జూనియర్ ఎన్టీఆర్ను కూడా తన సమీప బంధువు నార్నే వారి కుటుంబంతో వియ్యమందేలా చేసి హరికృష్ణను, జూ.ఎన్టీఆర్ను సైలెంట్ చేద్దామని అనుకున్నప్పటికీ బాబు ప్లాన్ బెడిసి కొట్టినట్టుగా తెలుస్తోంది.
జూనియర్ పెళ్లి అనంతరం మహానాడులో కూడా హరికృష్ణ తన అసంతృప్తిని మౌనం ద్వారా బయట పెట్టారు. మరోవైపు సినిమా షూటింగ్ బిజీ పేరుతో జూనియర్ ఎన్టీఆర్ మహానాడుకు గైర్హాజరై తన తండ్రికి అండగా ఉంటున్నానని చెప్పకనే చెప్పినట్టుగా కనిపిస్తోంది. హరికృష్ణ, జూనియర్ అసంతృప్తి గమనించిన బాబు మహానాడు వేదికపై లోకేష్ కుమార్ ఫోటోలు పెట్టవద్దని హెచ్చరించి లోకేష్ - ఎన్టీఆర్ మధ్య కొనసాగుతున్న వారసత్వ పోరుకు ముగింపు పలకాలని అనుకున్నప్పటికీ హరికృష్ణ మాత్రం వెనక్కి తగ్గినట్లుగా కనిపించడం లేదు. బాబు ఇప్పుడు అలా చెప్పినప్పటికీ జూనియర్ను పక్కన పెట్టి లోకేష్ తెరంగేట్రం కోసం తెర వెనుక ప్రయత్నాలు చేస్తాడనే అనుమానాలు హరికృష్ణలో ఉన్నందువల్లే ఆయన బాబు మాటలపై విశ్వాసంగా లేరని, అందుకే ఆయన బాబుపై ఆగ్రహం, ఆవేదనతో ఉన్నట్లుగా తెలుస్తోంది.