చైనాలో ఘనమైన సత్కారాన్ని పోందిన యోగ గురు అయ్యంగార్
ప్రపంచం స్టేజిల మీద గత 75 సంవత్సరాలుగా యోగని టీచ్ చేస్తున్నటువంటి యోగ గురు బికెఎస్ అయ్యంగార్ యోగ టీచ్ చేయడంలో తనదైన ముద్రని వేశారు. అలాంటి గోప్పవ్యక్తి బీకేఎస్ అయ్యంగార్ బొమ్మతో నాలుగు తపాలా బిళ్లలు విడుదలచేయడం ద్వారా చైనా ఆయన ను ఘనంగా సత్కరించింది. మంగళవారం బీజింగ్లో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన అయ్యంగార్కు 'చైనా పోస్ట్" బీజింగ్ శాఖ ఈ స్టాంపులను బహూకరించింది. భారత్-చైనా యోగా సదస్సులో పాల్గొనేందుకుగాను తొలిసారిగా చైనాకు వెళ్లిన అయ్యంగార్ వారం రోజులుగా అక్కడ వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.
తన కు ఈ అరుదైన గౌరవం లభించడంపై ఆయన చైనీయులకు కృతజ్ఞతలు తెలుపుతూ, హర్షం వ్యక్తంచేశారు. అయితే భారత్లో తన పేరిట తపాలా బిళ్లలు విడుదలచేయలేదని, ఇంగ్లండ్కు చెందిన తన విద్యార్థి పేరు మీద మాత్రం స్టాంపులు విడుదలచేశారంటూ ఆయన అసంతృప్తి వ్యక్తంచేశారు. కాగా చైనాలో యోగా పట్ల ఆకర్షితులయ్యేవారి సంఖ్య గణనీయంగా పెరుగుతుండగా, అయ్యంగార్ వద్ద యోగా నేర్చుకునేందుకు 1990ల నుంచే చాలా మంది చైనీయులు భారత్కు వస్తున్నారు. 93 ఏళ్ల అయ్యంగార్ను భారత ప్రభుత్వం ఇదివరకు పద్మశ్రీ, పద్మభూషణ్లతో సత్కరించింది.