ఆజాద్ చర్చలు, మెట్టు దిగని తెలంగాణ నేతలు
తెలంగాణ ఇవ్వండి, లేదంటే తమ రాజీనామాలను ఆమోదించాలని తాము ఆజాద్కు చెప్పినట్లు పొన్నం ప్రభాకర్ మీడియా ప్రతినిధులతో చెప్పారు. చర్చలు జరపాలనుకుంటే జరపండి, కానీ వెంటనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రక్రియ ప్రారంభించాలని కోరినట్లు ఆయన తెలిపారు. తెలంగాణ సమస్య పరిష్కారానికి విస్తృతస్థాయి సంప్రదింపులు, ఏకాభిప్రాయం కావాలని ఆజాద్ చెప్పినట్లు మధుయాష్కి చెప్పారు. చర్చలు జరపాలనుకుంటే వెంటనే ప్రారంభించాలని తాము కోరినట్లు ఆయన తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తెలంగాణ ప్రాంతంలో ఏకాభిప్రాయం ఉన్నప్పుడు, ఇతర ప్రాంతాల అభిప్రాయం అవసరం లేదని, అయితే, విభజన వల్ల వచ్చే ఇబ్బందుల గురించి సీమాంధ్ర ప్రతినిధులు చెప్పుకోవచ్చునని, ఆ సమస్యలను అధిగమించడానికి తాము సహకరిస్తామని పొన్నం ప్రభాకర్ అన్నారు. తమ పార్టీ అధిష్టానం తెలంగాణ ఇస్తుందనే నమ్మకం తమకు ఉందని కాంగ్రెసు ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి చెప్పారు.