సమైక్యవాణికి సీమాంధ్ర నేతలు రాజీనామాలు చేస్తారా?
సీమాంధ్ర కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల ఫోరం కన్వీనర్ శైలజానాథ్ ఇప్పటికే ఢిల్లీలో మకాం వేశారు. మరికొంత మంది సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు బుధవారం ఢిల్లీకి వెళ్లేందుకు సమాయత్తమవుతున్నారు. సీమాంధ్ర టీడీపీ కూడా ఆందోళనకు సిద్దమవుతున్నట్లు సమాచారం. గత ఏడాది డిసెంబర్ తొమ్మిదిన తెలంగాణ ప్రక్రియ మొదలైందని కేంద్ర హోంశాఖ మంత్రి పి.చిదంబరం చేసిన ప్రకటన తరువాత సీమాంధ్రలో జనజీవన స్తంభించేలా ఉద్యమాలు కొనసాగివ విషయం తెలిసిందే. ఇదే తరహా ఉద్యమాలకు అన్ని పార్టీలు సిద్ధమవుతున్నట్లు సమాచారం. సమైక్యాంధ్రకు అనుకూలంగా లాబీయింగ్ చేసేందుకు కాంగ్రెసు నేతలు ఈ నెల ఐదో తేదీనే వీరు ఢిల్లీకి వెళ్లాలని తొలుత వీరు నిర్ణయించారు. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో ఢిల్లీకి రావద్దని అధిష్ఠానం సూచించడంతో దాన్ని వాయిదా వేసుకొన్నారు.
టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు నేతృత్వంలో సీమాంధ్ర టీడీపీ నేతలు ఉద్యమాలకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే విజయనగరంలో దేవినేని సమైక్యాంధ్ర ఉద్యమాలకు శ్రీకారం చుట్టారు. ఇలా సీమాంధ్రలో ఏ పార్టీకి ఆ పార్టీ స్వతహాగా సమైక్య ఉద్యమంతో ముందుకెళ్లాలని నిశ్చయించాయి. గత ఏడాది డిసెంబర్ తొమ్మిది తరువాత చేపట్టిన ఉద్యమం తరహాలోనే మళ్లీ ఉద్యమించాలని వారు భావిస్తున్నట్లు సమాచారం.