కేశవరావుపై సర్వే ఫైర్, పదవి రాకుండా చేశాడని గుర్రు
బుధవారం పార్లమెంట్ సెంట్రల్హాల్లో ఎంపీలు కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి, అంజన్కుమార్, సురేష్ షేట్కర్, సబ్బం హరి కూర్చున్నప్పుడు సర్వే వచ్చి చర్చను లేవదీశారు. రాజీనామాల వల్ల ఫలితం ఏమీ కనిపించలేదని, గతంలో లాగా పార్లమెంటు సమావేశాలను స్తంభింపజేసి ఉంటే బాగుండేదని సర్వే అన్నారు. తనకు మంత్రిపదవి రాలేదని తెలియగానే మంత్రి శంకర్రావుకు కేకే ఫోన్ చేసి 'నీవు చెప్పినట్లే సర్వేకు పదవి రాకుండా చేశాను' అని అన్నారన్నారు. 'శంకర్రావుతో కేకే ఎవరి ఫోన్లో మాట్లాడారో కూడా నాకు తెలుసు. ఆ తర్వాత శంకర్రావు ఢిల్లీకి వచ్చినప్పుడు సర్వేకు పదవి రాకుండా చేశానని చెబుతూ కేకే గట్టిగా హత్తుకున్నారు. ఈ సంఘటనపై కూడా నాకు సాక్ష్యాలున్నాయని ఆయన అన్నారు. చాలాసార్లు అధిష్ఠానానికి రాసిన లేఖలపై మాతో సంతకాలు చేయించి కేశవరావు చేయకుండా తప్పించుకోజూస్తే, తాను ప్రశ్నించానన్నారు. తమ సంతకాలతో కూడిన లేఖ అహ్మద్పటేల్కు చూపించి మా పిల్లలు చాలా ఒత్తిడి చేస్తున్నారని కేకే చెప్పుకొనే వారని, తామేం పిల్లవాళ్లం కాదని సర్వే అన్నారు.
డిసెంబర్ 9 కంటే డిసెంబర్ 23 ప్రకటనలోనే తెలంగాణపై స్పష్టమైన వాగ్దానం ఉన్నదని సర్వే అభిప్రాయపడ్డారు. తెలంగాణపై అన్ని పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదిరిందని, అయితే పరిస్థితి మారిందన్న విషయాన్ని స్పష్టంగా చెప్పారని ఆయన తెలిపారు. ఈ పరిస్థితుల్లో అన్ని పార్టీల మధ్య ఏకాభిప్రాయానికి కాంగ్రెస్ ఎంపీలు పట్టుబట్టి ఉంటే బాగుండేదన్నారు. అది కాకుండా తెలంగాణపై అధిష్ఠానం వెనక్కి వెళ్లిందనే దుష్ప్రచారం చేశారని, చివరకు జేఏసీలో చేరారని సర్వే పేర్కొన్నారు.
'రాజీనామా చేయాలని నాపై ఎవరూ ఒత్తిడి తేలేదు. నా నియోజకవర్గ ప్రజల మనోభావాలకు అనుగుణంగానే రాజీనామా చేశాను' అని పార్లమెంటు సభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సర్వేకు జవాబిచ్చారు. కాగా, మరో ఎంపీ సురేష్ షేట్కర్ మాత్రం కోమటిరెడ్డి వ్యాఖ్యలను ఖండించారు. తాను సోనియాకు రాజీనామా లేఖలు సమర్పించాలని చెబితే, నేరుగా స్పీకర్కు రాజీనామాలు ఇచ్చారని, దీనితో తాను కూడా రాజీనామా పంపాల్సి వచ్చిందని ఆయన అన్నారు.