భారత ఐటి రంగంపై మరోసారి 'ఆర్థిక మాంద్యం' పంజా!
ఇప్పటికే అమెరికా రేటింగ్ ప్రభావం ప్రపంచ మార్కెట్లపై ఏ విధంగా రోజు వివిధ ప్రసార సాధనాల్లో మనం చూస్తునే ఉన్నాం. మరి ఇప్పుడు అందరినీ వెంటాడుతున్న ప్రశ్న ఒక్కటే.. 2007-09 రోజులు మళ్లీ తిరిగి రానున్నాయా..? మరి దీనికి సమాధానం ఏంటని విశ్లేషకులను అడిగితే వారు చెప్పే సమాధనం 'అవును' అని. ఇందుకు తగిన సంకేతాలు ఇప్పటికే దేశీయ ఐటి పరిశ్రమకు చేరిపోయాయి. అగ్రరాజ్యాలుగా ఉండి ప్రపంచాన్ని శాసిస్తున్న యూఎస్, యూరప్ దేశాలే ఈ సంకేతాలనిస్తున్నాయి.
అమెరికా, యూరో జోన్ల ఆర్థిక సంక్షోభం భారత ఐటి రంగంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ప్రపంచ సాఫ్ట్వేర్ రంగంలో మన దేశానిది కీలక పాత్ర. విదేశీ ఐటి దిగ్గజాలకు ధీటుగా సమాధానం చెప్పగల కంపెనీలు ఇప్పుడు మన దేశంలోనే ఉన్నాయి. కేవలం గడచిన 20 ఏళ్లలోనే అమెరికా, యూరప్ దేశాల ఐటి కంపెనీలకు సరితూగే కంపెనీలు ప్రస్తుతం మన దేశంలో కూడా ఉన్నాయి. మరి ఇన్ని సదుపాయాలు ఉన్నప్పుడు మనం భయపడాల్సిన అవసరం ఏంటనే కదా మీ సందేహం.
భారతదేశ ఐటి రంగం దేశీయంగా నిర్వహిస్తున్న కార్యకలాపాల కంటే అంతర్జాతీయంగా వివిధ దేశాల కోసం నిర్వహిస్తున్న కార్యకలాపాలే ఎక్కువ. అంటే మనదేశ ఐటి రంగం దాదాపుగా విదేశీ మార్కెట్లపైనే ఆధారపడి ఉందని అర్థం. ఇలా విదేశీ వ్యాపారం ద్వారా వచ్చిన ఆదాయాలతోనే మన ఐటి కంపెనీలు నిలదొక్కుకుంటున్నాయి. అయితే, తాజాగా.. అమెరికా, యూరప్ దేశాలలో ఏర్పడుతున్న ఆర్థిక సంక్షోభం మన దేశీయ ఐటి కంపెనీలకు తీవ్ర ముప్పును తీసుకువచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.
మన దేశీయ ఐటి రంగానికి అత్యధిక ఆదాయం విదేశీ ఎగుమతుల ద్వారానే వస్తోంది. ఇందులో అధిక భాగం అమెరికా, యూరప్ దేశాల నుంచి వస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆయా దేశాల్లో నెలకొన్న తాజా పరిణామాల కారణంగా దేశీయ ఐటి పరిశ్రమలకు వచ్చే ఆదాయం సన్నగిల్లే ఆస్కారం ఉంది. ఎక్కువగా విదేశీయ వ్యాపారం మీద ఆధారపడిన మన ఐటి పరిశ్రమ మరోసారి నష్టాల ఊబిలో చిక్కుకొని 2007-09 పరిస్థితులను చవిచూసే ఆస్కారం ఉంది.
రేటింగ్ ఏజన్సీ స్టాండర్డ్ అండ్ పూర్స్ (ఎస్అండ్పి) అమెరికా రుణాధిపత్యాన్ని తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయం భారత ఎంత ప్రభావాన్ని చూపిందంటే.. గడచిన ఒక్క వారంలోనే మార్కెట్ కాపిటల్ పరంగా టాప్ 10 స్థానాల్లో ఉన్న కంపెనీలు రూ. 61,000 కోట్లను నష్టపోయాయి. యుఎస్ నుంచి వచ్చే ఐటి ఆదాయంపై అధికంగా ఆధారపడ్డ టిసిఎస్, ఇన్ఫోసిస్లు కూడా అత్యధికంగా నష్టపోయాయి. టిసిఎస్ మార్కెట్ కాప్ 20,648 కోట్లు తగ్గి 1,86,168 కోట్లకు, ఇన్ఫోసిస్ మార్కెట్ కాప్ 12,408 కోట్లు తగ్గి 1,36,336 కోట్ల రూపాయలకు చేరాయి.
మరి ఐటి కంపెనీలు ఏం చేయనున్నాయి..! ఒకవేళ ఇదే గనుక జరిగితే ఐటి కంపెనీలు తీసుకునే ప్రధాన నిర్ణయం కాస్ట్ కటింగ్ (ఖర్చుల తగ్గింపు). ఖర్చుల తగ్గింపు పేరుతో కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగుల వేతనాలు భారీగా తగ్గించడం, ఉద్యోగుల సంఖ్యను రీసైజింగ్ (తగ్గించడం) చేయడం, కాంట్రాక్టు ఉద్యోగులపై వేటు వేయడం, తక్కువ వేతనాలతో ఎక్కువ పని చేయించుకోవడం వంటి చర్యలు తీసుకోనున్నాయి.
ప్రస్తుతం అమెరికా, యూరప్లలో నెలకొన్న తాజా ఆర్థిక మాంద్యం మన దేశ ఆర్థిక వ్యవస్థపై మాత్రం ప్రభావం చూపబోదని నిపుణులు చెబుతున్నప్పటికీ, అది ఐటి పరిశ్రమై ఉండబోదనే భరోసాను మాత్రం ఇవ్వలేక పోతున్నారు. ఇందుకు ప్రధాన కారణం మన దేశీయ ఐటి పరిశ్రమ ఎక్కువగా ఈ రెండు దేశాలపైనే ఆధారపడి ఉండటం. అయితే, పెక్కు మంది నిపుణులు మాత్రం ఈ పరిస్థితులు తాత్కాలికమేనని భావిస్తున్నారు. ఏదేమైనప్పటికీ.. మన దేశం ఒక్క ఐటి రంగంలోనే కాకుండా మిగిలిన అన్ని రంగాల్లోనూ సమాన వృద్ధిని సాధిస్తూ.. ప్రపంచ దేశాలకు ధీటుగా ఎదగాలని భారతీయులుగా మనమందరం కోరుకుందాం..!