చంద్రబాబుకు మునిశాపం ఉంది: వైయస్ జగన్
కేవలం రెండంటే రెండు ఎకరాలతో కనీస సౌకర్యాలు కూడా లేని చంద్రబాబు నాయుడికి ఇవాళ ఇన్ని కోట్లు ఎలా వచ్చాయని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రశ్నించారు.చంద్రబాబు హయాంలో ఎన్నో ఎకరాల భూములు, ఇంకా ఎన్నెన్నో కార్యక్రమాలు చేశాడనీ, అవన్నీ అభివృద్ధి పథకాలని చెపుతుంటారనీ, వాటిని మించిన అభివృద్ధి చేసినవారిని చూస్తే మాత్రం ఆయనకు అదంతా అవినీతిగా కనబడుతుందని జగన్ ఎద్దేవా చేశారు. రెండు ఎకరాల నుంచి కోట్ల ఆస్తులకు పడగలెత్తిన చంద్రబాబు అవినీతి గురించి మాట్లాడితే వినేందుకు ఛండాలంగా ఉందన్నారు. ఒక వేలితో మరొకర్ని చూపించేటపుడు నాలుగు వేళ్లు మనల్నే చూపిస్తాయన్న సంగతిని చంద్రబాబు నాయుడు తెలుసుకోవాలన్నారు.
విపక్ష నేతగా ప్రజల బాగోగులు పట్టని చంద్రబాబు నాయుడు, కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కై ఈ ప్రభుత్వానికి పరోక్షంగా సహకారం అందిస్తున్నారని విమర్శించారు. ప్రజలు తగిన బుద్ధి చెప్పే రోజు ఎంతో దూరంలో లేదని అన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు డిపాజిట్లు కూడా దక్కవని జోస్యం చెప్పారు.