రోజుల్లో తెలంగాణపై నిర్ణయం, ప్రకటన చేసేది చిదంబరమే

శుక్రవారం జరిగే కాంగ్రెసు కోర్ కమిటీ సమావేశంలో తెలంగాణపై స్పష్టమైన నిర్ణయం తీసుకుంటారని చెబుతున్నారు. శుక్రవారం నిర్ణయం తీసుకున్న తర్వాత శనివారం ప్రకటన వెలువడవచ్చునని అంచనాలు వేస్తున్నారు. అయితే, తెలంగాణపై పార్టీ కోర్ కమిటీ విస్తృతంగా చర్చించిందని ఆజాద్ చెప్పారు. పార్టీపరంగా నిర్ణయం ఏదీ ఉండదని, ప్రభుత్వపరంగానే తెలంగాణణపై నిర్ణయం వెలువడుతుందని ఆయన చెప్పారు. తెలంగాణపై కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం ప్రకటన చేస్తారని ఆయన చెప్పారు.
కాంగ్రెసు అధిష్టానం నిర్ణయం తర్వాత రాజకీయ వ్యవహారాల కమిటీలో చర్చిస్తారనే వాదన కూడా వినిపిస్తోంది. ఆ తర్వాత మిత్రపక్షాలతో చర్చిస్తారని అంటున్నారు. తుదిగా రాష్ట్రానికి చెందిన పార్టీలతో అఖిల పక్ష సమావేశాన్ని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయవచ్చునని అంటున్నారు. ఒక పార్టీ తెలంగాణపై ఒకే నిర్ణయం చెప్పాలనే వైఖరితో ఈ సమావేశం జరిగే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందనేది కూడా అంచనాలకు అందడం లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటును తప్ప ప్రాంతీయ మండళ్ల ఏర్పాటు వంటి ఎటువంటి ప్రత్యామ్నాయాలను కూడా అంగీకరించబోమని అన్ని పార్టీలకు చెందిన తెలంగాణ నాయకులు అంటున్నారు. రాష్ట్రం సమైక్యంగానే ఉండాలని సీమాంధ్ర నాయకులు అంటున్నారు. అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం వెలువడుతుందని పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, మాజీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ వంటి రాష్ట్రానికి చెందిన కాంగ్రెసు నాయకులు అంటున్నారు. అదెలా ఉంటుందనేదే ఇప్పుడు ఉత్కంఠను రేపే విషయం.












Click it and Unblock the Notifications