అటు ఇటు: అవిశ్వాసం అంతా అయోమయమే

తెలుగుదేశం పార్టీ టిఆర్ఎస్, జగన్ వర్గం ఎమ్మెల్యేలను లక్ష్యంగా చేసుకోగా, తెలంగాణ తెలుగుదేశం పార్టీ తెలంగాణ కాంగ్రెసు ఎమ్మెల్యేలను కూడా సవాల్ చేస్తోంది. కేవలం పదికి కాస్త అటు ఇటు ఎమ్మెల్యేలు మాత్రమే జగన్ వెంట ఉంటారని రాజకీయ పరిశీలకులు భావించినప్పటికీ ఆదివారం జరిగిన భేటీకు ఏకంగా పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారు. అదీ కాంగ్రెసు పార్టీ విప్ జారీ చేశాక కూడా హాజరు కావడం విశేషం. ప్రభుత్వం నుండి మరో పదిహేడు మంది ఎమ్మెల్యేలను తమవైపు తిప్పుకుంటే ప్రభుత్వం కూలుతుందన్న ఉద్దేశ్యంతో జగన్ వర్గం 6గురు పిఆర్పీ, మరికొందరు టి-కాంగ్రెసు ఎమ్మెల్యేలతో చర్చలు జరుపుతున్నట్లుగా రూమర్స్ వచ్చాయి. కొందరు పిఆర్పీ ప్రజాప్రతినిధులు జగన్కు అమ్ముడు పోయిన కారణంగానే విప్ జారీ చేయవద్దని చిరంజీవిని కోరుతున్నట్లుగా పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఉదయం సిఎం కిరణ్తో భేటీ అయిన జగన్ వర్గం కాపు రామచంద్రా రెడ్డి మధ్యాహ్నానికల్లా జగన్ గ్రూపులోనే అంటూ స్టేట్మెంట్ ఇచ్చేశారు. గుర్నాథ్ రెడ్డిని మంత్రులు శైలజానాథ్, రఘువీరా రెడ్డి బుజ్జగించే ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. ఇప్పటికే తాను కాంగ్రెసులోనే ఉంటానని తేల్చి చెప్పిన కుంజా సత్యవతి ఉదయం సిఎంతో భేటీ అయ్యారు. ఓ వైపు అవిశ్వాసం వీగిపోతుందని సిఎం, బొత్స కాంగ్రెసు వర్గాలు ధీమా వ్యక్తం చేస్తుండగా జగన్, టిఆర్ఎస్ కాంగ్రెసు నుండి కొంతమందిని రప్పించుకునేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. టిడిపి సవాల్ కంటే తమకు లబ్ధి ఉంటుందన్న ఏకైక కారణంతోనే జగన్, టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఎడతెరిపి ప్రయత్నాలు చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఎవరికి వారు తమ తమ ప్రయత్నాలు చేయడంతో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి.
ఏడుగురి రాజీనామాలు ఆమోదించడంతో అసెంబ్లీలో ప్రస్తుతం 287 మంది సభ్యులు ఉన్నారు. అవిశ్వాసం వీగిపోవాలంటే ప్రభుత్వం 144 మేజిక్ మార్కు చూపించారు. ప్రభుత్వానికి కాంగ్రెసు 153(రాజీనామాలు ఆమోదించగా మిగిలినవి), పిఆర్పీ 18, ఎంఐఎం 7 మొత్తం 178 ఎమ్మెల్యేల మద్దతు ఉంది. కాంగ్రెసు నుండి 18 మంది, పిఆర్పీ నుండి ఒకరు(శోభా నాగిరెడ్డి) జగన్ వైపు వెళ్లగా 159 మంది ఎమ్మెల్యేలు మిగిలారు. మేజిక్ ఫిగర్ కంటే ఇది పదిహేను ఎక్కువే అయినప్పటికీ పిఆర్పీకి చెందిన ఆరుగురు, టి-కాంగ్రెసుకు చెందిన పన్నెండు మంది ఎమ్మెల్యేల వరకు జగన్, టిఆర్ఎస్ వలలో పడినట్లు పుకార్లు వచ్చిన దృష్ట్యా అందరిలోనూ ఉత్కంఠ కనిపిస్తోంది. అయితే పుకార్లను టి-కాంగ్ ఎమ్మెల్యే కెఎల్ఆర్, పిఆర్పీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు కొట్టి పారేశారు. కాగా పిఆర్పీ ఎమ్మెల్యేలు సాయంత్రం మరోసారి సమావేశమయ్యారు. విప్ జారీ చేసేందుకు చిరంజీవి దాదాపు నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications