జగన్ పార్టీలోకి సోనేరావు, కెసిఆర్కు ఆదివాసీల దెబ్బ
తెరాసలో సోనేరావుకు తగిన ప్రాధాన్యం లభించలేదనే విమర్శ ఉంది. దాంతో ఆయన చురుగ్గా వ్యవహరించలేకపోయారు. పార్టీతో తెగదెంపులు చేసుకున్నారు. కొమురం భీము వారసత్వాన్ని కెసిఆర్ తన పార్టీ ప్రతిష్టను పెంచుకోవడానికి వాడుకుంటూ వస్తున్నారు. కానీ కొమురం భీము కుటుంబానికి ఆయన ఏనాడూ తగిన ప్రాధాన్యం ఇవ్వలేదని అంటున్నారు. ఆదివాసీలకు తగిన ప్రాధాన్యం ఇస్తానని, పోటీ చేయదలుచుకుంటే సోనేరావుకు పార్టీ టికెట్ ఇస్తానని వైయస్ జగన్ హామీ ఇచ్చినట్లు సోనేరావును పార్టీలోకి తెచ్చిన సోయం బాపూరావు మీడియా ప్రతినిధులతో చెప్పారు.
లంబాడీలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ తెరాస ఆదివాసీలను నిర్లక్ష్యం చేస్తుందనే విమర్శలు మొదటి నుంచీ వస్తున్నాయి. పార్టీ గిరిజన విభాగంలోనైనా తమకు తెరాస ఎందుకు ప్రాధాన్యం ఇవ్వలేదని ఆదివాసీలు ప్రశ్నిస్తున్నారు. ప్రాధాన్యం గల పదవి ఒక్కటి కూడా తమకు ఇవ్వలేదని వారంటున్నారు. సీట్ల కేటాయింపులో గత పదేళ్లుగా తమ పట్ల తెరాస వివక్ష ప్రదర్శిస్తోందని విమర్సిస్తున్నారు. తెరాస గిరిజన విభాగం అధ్యక్ష పదవిలో లంబాడీ నాయకులే నియమితులవుతూ వస్తున్నారని చెబుతున్నారు.