విదేశీ ఇన్వెస్టర్లకు కేంద్రం భారీ ఉపశమనం: ఇకపై
భారత్ లో ప్రభుత్వ బాండ్లలో పెట్టుబడి పెట్టే విదేశీ ఇన్వెస్టర్లకు కేంద్రం భారీ ఉపశమనం కల్పించింది. బాండ్లపై మూలధన లాభాల పన్నును రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. పశ్చిమాసియా ఉద్రిక్తతలు, పెరుగుతున్న ముడి చమురు ధరల నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థపై పడుతున్న భారాన్ని తగ్గించే వ్యూహాత్మక ప్రయత్నాలలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత పరిస్థితుల్లో దేశీయ రుణ మార్కెట్లోకి విదేశీ నిధులను ఆకర్షించాలనేది దీని ముఖ్య ఉద్దేశం.
ఈ ప్రతిపాదనకు కేంద్ర మంత్రిమండలి ఇదివరకే ఆమోదం తెలిపింది. ఆదాయపు పన్ను చట్టంలో మార్పులు చేస్తూ రూపొందించిన ఆర్డినెన్స్కు క్యాబినెట్ గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రపతి ఆమోదం పొందిన తర్వాత ఈ కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయి. విదేశీ పెట్టుబడులను పెంచడం, రూపాయి విలువను స్థిరీకరించడం ద్వారా దేశ ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడటం ఈ చర్య ప్రధాన ఉద్దేశమని అధికారిక వర్గాలు వెల్లడించాయి.

భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం క్లిష్ట సమయాన్ని ఎదుర్కొంటోంది. విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు ఈ ఏడాది దాదాపు 2.5 లక్షల కోట్ల రూపాయల విలువైన దేశీయ ఈక్విటీలను విక్రయించారు. 2026లో విదేశీ నిధుల భారీ ఉపసంహరణ మార్కెట్ వర్గాల్లో ఆందోళనలు పెంచింది. ఈ ఒత్తిడిని తొలగించి, ప్రభుత్వ బాండ్లను పెట్టుబడిదారులకు మరింత ఆకర్షణీయంగా మార్చడం ద్వారా కొత్త నిధులను ఆకర్షించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
ప్రస్తుతం 12 నెలల కంటే ఎక్కువ కాలం ఉంచిన షేర్లు, బాండ్లపై విదేశీ మదుపర్లు 12.5 శాతం దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను చెల్లిస్తున్నారు. నూతన ప్రతిపాదనల ప్రకారం.. ఇకపై ప్రభుత్వ సెక్యూరిటీలలో పెట్టుబడి పెట్టే విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లకు ఈ మూలధన లాభాల పన్ను వర్తించదు. దీనితో పాటు ఈ బాండ్లపై వచ్చే వడ్డీ ఆదాయానికి సంబంధించిన పన్ను విధానాన్ని కూడా ప్రభుత్వం త్వరలోనే సమీక్షించవచ్చని సమాచారం.
విదేశీ మదుపర్లు ప్రస్తుతం ప్రభుత్వ సెక్యూరిటీలపై వచ్చే వడ్డీపై 20 శాతం విత్హోల్డింగ్ పన్ను చెల్లిస్తున్నారు. గతంలో ఉన్న అయిదుశాతం పన్ను రాయితీని 2023లో ప్రభుత్వం తొలగించింది. ప్రస్తుత పన్ను నిర్మాణం వల్ల భారత ప్రభుత్వ బాండ్లు ఇతర వర్ధమాన మార్కెట్లతో పోలిస్తే అంత ఆకర్షణీయంగా లేవని మార్కెట్ నిపుణులు వాదిస్తుండేవారు. ఈ మార్పుల ద్వారా భారత బాండ్లకు ఆదరణ పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
బాండ్ మార్కెట్లో విదేశీ భాగస్వామ్యం పెరగడం ద్వారా దేశంలోకి డాలర్ల ప్రవాహం పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ పెట్టుబడులు పెరిగితే, రూపాయి విలువ మెరుగుపడటంతో పాటు నగదు లభ్యత కూడా పెరుగుతుంది. ఈక్విటీ మార్కెట్ బలహీనంగా ఉన్న ప్రస్తుత తరుణంలో, ఇది అదనపు వనరుగా మారుతుంది. ఇంధన ధరల ప్రభావం, ద్రవ్యోల్బణ సవాళ్లను ఎదుర్కొంటున్న ప్రస్తుత దశలో, ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో ఈ నిర్ణయం కీలకం కానుంది.












Click it and Unblock the Notifications